టీమిండియా అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్కు దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అండగా నిలిచాడు. అతనిపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాడు. అరంగేట్రంలోనే 10 వికెట్లు తీయాలా? అని విమర్శకులను ప్రశ్నించాడు. ఓ కుర్రాడి నుంచి అసాధారణ ప్రదర్శన ఆశించడం ఏంటని అసహనం వ్యక్తం చేసాడు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్తో అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ పేసర్లు ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్ గాయపడటంతో అన్షుల్ కంబోజ్కు టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కింది. అతను తొలి ఇన్నింగ్స్లో 18 ఓవర్లు వేసి 89 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీసాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విమర్శలపై స్పందించిన కపిల్ దేవ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
'ఓ అరంగేట్ర పేసర్ నుంచి ఏం ఆశిస్తున్నారు? తొలి మ్యాచ్లోనే 10 వికెట్లు తీస్తాడని భావించారా? అతని సత్తాను అంచనా వేయండి పర్వలేదు. అతను తప్పకుండా పుంజుకొని అద్భుత ప్రదర్శన చేస్తాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఏ ఆటగాడికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. ఎవరైనా సరే కాస్త ఇబ్బంది పడుతారు. అన్షుల్ బౌలింగ్లో మంచి నైపుణ్యం ఉంది. తప్పకుండా మెరుగవుతాడు. అతనిపై విమర్శలు గుప్పించడం సరికాదు.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్కు కూడా కాస్త సమయం ఇవ్వాలని సూచించాడు.

నాలుగో టెస్ట్లో దారుణంగా విఫలమైన జస్ప్రీత్ బుమ్రాకు కూడా కపిల్ దేవ్ అండగా నిలిచాడు. 'ఒక్కో బౌలర్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాలం మారుతోంది. శరీరాలు సహకరించడం కూడా వేర్వేరుగా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఉన్న పేసర్లలో టాప్ ఆటగాడు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా చాలా ప్రత్యేకమైనది. నిలకడగా బంతులేయడం చాలా కష్టం. అతను ఇంత కాలం ఆడుతాడని కూడా అనుకోలేదు. ఇప్పటికీ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. విలక్షణమైన బౌలింగ్ శైలితో ఇన్నాళ్లు కొనసాగడమే గొప్ప. జస్ప్రీత్ బుమ్రాకు హ్యాట్సాఫ్'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
IND vs ENG: ఏం పుట్టిందిరా అయ్యా మీకు..?
ఈ మ్యాచ్లో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసింది. 311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్గా వెనుదిరిగారు. క్రిస్ వోక్స్ తన తొలి ఓవర్లోనే ఈ ఇద్దర్నీ స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు 544/7 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆలౌటైంది.