ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. 311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్గా వెనుదిరిగారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ ఓటమి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు 544/7 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకే పరిమితమైంది.
ఈ క్రమంలోనే టీమిండియా ఆటతీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో టీమిండియా గట్టి పోటీనిచ్చింది. మూడు మ్యాచ్ల్లో ఒక్కటే గెలిచినా.. ఇంగ్లండ్ను తమ ఆట తీరుతో వణికించింది. ఈ మూడు టెస్ట్ల్లో ఎక్కువ సెషన్స్ను టీమిండియా గెలుచుకుంది. ఓటమి ముంగిట అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఈ మూడు మ్యాచ్లు కూడా ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకు సాగాయి. కానీ నాలుగో టెస్ట్ మాత్రం ఈ మూడు మ్యాచ్లకు భిన్నంగా మొదలైంది.

తొలి రోజు పర్వాలేదనిపించిన టీమిండియా.. రెండో రోజు నుంచి పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో తేలిపోయింది. ముఖ్యంగా భారత బౌలర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కంబోజ్, శార్దూల్ ఠాకూర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎన్నడూ లేని విధంగా బుమ్రా 100 ప్లస్ రన్స్ సమర్పించుకున్నాడు. సిరాజ్ కూడా చేతులెత్తేసాడు. కెప్టెన్గా శుభ్మన్ గిల్ తడబడ్డారు. దాంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ నమోదు చేయడంతో పాటు రికార్డ్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే దిశగా సాగుతోంది.
ప్రస్తుతం భారత్కు డ్రా చేసుకోవడం తప్పా మరో ఆప్షన్ లేదు. ఆఖరి రోజు చివరి సెషన్ వరకు బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి టీమిండియాకు ఏర్పడింది. భారత జట్టు ఆట తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఏం పుట్టిందిరా అయ్యా మీకు'అంటూ కామెంట్ చేస్తున్నారు. బౌలింగ్, బ్యాటింగ్లో విఫలమవ్వడం ఏంటని మండిపడుతున్నారు. కొందరైతే కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.