
వకార్నే ఎంచుకుంటా..
ఈ లైవ్ సెషన్లో మంచి హోం వర్క్తో వచ్చిన ఫుట్బాల్ కెప్టెన్.. తన ట్రిక్కీ ప్రశ్నలతో కోహ్లీని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో చివరి బంతికి షేన్ వార్న్ లేదా వకార్ యూనిస్లలో ఒకరిని ఎదుర్కోవాల్సి వస్తే... అది కూడా ఆ మ్యాచ్ ఆఖరి బంతిని మూడు పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితి ఉంటే ఎవరిని ఎంచుకుంటావని కోహ్లీని.. ఛెత్రీ ప్రశ్నించగా.. వకార్నే ఎంచుకుంటానని కోహ్లీ బదులిచ్చాడు.‘యార్కర్లను బాగా ఆడటంలో నా సామర్థ్యంపై నాకు నమ్మకముంది. అలా అని షేన్ వార్న్ అంటే భయమేమీ లేదు. అతను ఎప్పుడూ డెత్ ఓవర్లలో పెద్దగా బౌలింగ్ చేసింది లేదు. ఐపీఎల్లో అతడిని ఎదుర్కొన్నప్పుడు కూడా అనూహ్యమేమీ జరగలేదు. వార్న్ నన్ను అవుట్ చేయలేదు. నేను అతడి బౌలింగ్ను చితక్కొట్టలేదు కూడా. ఒకసారి మ్యాచ్ ముగిసిన తర్వాత నా వద్దకు బౌలర్కు ఎప్పుడూ మాటల్లో జవాబివ్వవద్దని అతను చెప్పాడు. కానీ నేనేమీ ఆ సూచనను పట్టించుకోలేదు. ఐపీఎల్ ప్రారంభంలో వార్న్ నన్ను ఓ మూర్ఖుడిలా చూసేవాడు'అని విరాట్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఆ సచిన్ ఇన్నింగ్స్ ఆడాలనుంది..
1998 షార్జా కప్లో ఆస్ట్రేలియాతో ఏడారి దేశంలో సచిన్ టెండూల్కర్ సృష్టించిన పరుగుల తుఫాన్లాంటి ఇన్నింగ్స్ తనకు ఆడాలనుందని కోహ్లీ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో నేను కూడా అలాంటి ఇన్నింగ్స్ ఒకటి ఆడితే బాగుండేది అనిపించే మ్యాచ్ సచిన్ టెండూల్కర్ ‘ఇసుక తుఫాన్'. ఫైనల్కు అర్హత సాధించే క్రమంలో 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్లో అతని సెంచరీ అత్యద్భుతం.'అని ఛెత్రీతో కోహ్లీ అన్నాడు. ఆ మ్యాచ్లో మాస్టర్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులతో వీరవిహారం చేసి జట్టును ఫైనల్కు చేర్చాడు.
ఏడారిలో సచిన్ తుఫాన్ .. బర్తేడే రోజు ఆస్ట్రేలియాను మాములుగా ఆడుకోలేదు!!

నా సెలక్షన్కు లంచం అడిగారు..
వరల్డ్ క్లాస్ ప్లేయర్గా ప్రశంసలు అందుకుంటున్న కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఢిల్లీ జట్టులో తన సెలక్షన్ కోసం అధికారులు లంచం అడిగితే.. తన తండ్రి ప్రేమ్ కోహ్లీ తిరస్కరించాడని గుర్తు చేసుకున్నాడు. ‘నేను క్రికెట్ ఆడటం ప్రారంభించిన కొత్తలో ఒక జట్టులో చోటు దక్కలేదు. ప్రతిభకు లోటు లేదు కానీ లంచం ఇస్తేనే జట్టులోకి తీసుకుంటానని కోచ్ చెప్పాడు. మా అబ్బాయి సత్తా ఉంటే ఆడతాడు లేదంటే తప్పుకుంటాడు తప్ప నేను అలాంటి తప్పుడు పని చేయను అంటూ నాన్న కోచ్ ప్రతిపాదనను తిరస్కరించాడు. చోటు దక్కనందుకు ఆ రోజు చాలా బాధపడ్డాను కానీ తర్వాత వాస్తవం తెలిసింది.

నాన్న నేర్పిన పాఠాలే..
సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన నాన్న తర్వాత లాయర్గా మారారు. ఆయన నేర్పిన పాఠాలే నేను జీవితంలో ఎదిగేందుకు పనికొచ్చాయి. ఇప్పటికీ నాటి ఘటనను నేను సానుకూలంగానే చూస్తాను. నా 18 ఏళ్ల వయసులో ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. బతికుంటే ఆయనను చాలా బాగా చూసుకునేవాడినని మాత్రం అనిపిస్తుంది. నేను పశ్చిమ ఢిల్లీలో పుట్టి పెరిగాను. ఎప్పుడూ మూలాలు మరచిపోను. అక్కడి మిత్రులు కలిస్తే అప్పుడు ఎలా మాట్లాడుకునేవాళ్లమో అదే భాషతో వారితో మాట్లాడతాను తప్ప గొప్పలు ప్రదర్శించను.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
