ఇంగ్లండ్ టూర్ కన్నా..
తన కెరీర్లోనే అత్యంత దారుణ పర్యటనగా చెప్పుకునే 2014 ఇంగ్లండ్ టూర్ కన్నా తాజా పర్యటనలో కోహ్లీ అధ్వాన్నంగా ఆడాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో మొత్తం 258 పరుగులు చేయగా... ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో అంతకంటే తక్కువ పరుగులతో చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైన కోహ్లీ( 30 బంతుల్లో 3 ఫోర్లతో 14) .. ఈ రెండు టెస్ట్ సిరీస్లో మొత్తం 38 పరుగులే చేశాడు.
తొలి ఇన్నింగ్స్ తరహాలో..
కొలిన్ డి గ్రాండ్హోమ్ వేసిన 17 ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బంతి అనుకొని పొరబడిన కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. బంతి అద్భుతంగా స్వింగై కోహ్లీ ప్యాడ్లను తాకేసింది. తొలి ఇన్నింగ్స్లో కూడా టీమ్ సౌథీ బౌలింగ్లో ఇదే తరహాలో ఔటైన కోహ్లీ.. రివ్యూకెళ్లి విమర్శలపాలయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో కూడా రివ్యూ కెళ్లాలని సహచర ఆటగాడు సూచించినా పట్టించుకోని కోహ్లీ.. మరో రివ్యూను వృథా చేయకుండా వెనుదిరిగాడు.2018లో కేప్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో సైతం కోహీ ఇదే విధంగా ఔటయ్యాడంటూ కామెంటేటర్లు పేర్కొన్నారు.
జడేజా కళ్లు చెదిరే క్యాచ్.. సూపరో సూపర్..!(వీడియో)
విమర్శకుల నోట..
ఇక వరల్డ్క్లాస్ బ్యాట్స్మన్ ఇలా ఒకే విధంగా ఔటవ్వడంతో విమర్శకులు భారత కెప్టెన్పై నోరుపారేసుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్కు రెండో ఇన్నింగ్స్కు తేడా చూపించలేదని.. నేర్చుకోవడంలో సారథే వెనుకంజలో ఉంటే సహచర, యువ క్రికెటర్లు అతడి నుంచి ఏం నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కాగా, కివీస్ టెయిలెండర్లు సులువుగా బ్యాటింగ్ చేసిన చోట భారత బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమవడాన్ని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఓటమి దిశగా..
7 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. ట్రెంట్ బోల్ట్ (3/12) ధాటికి కుదేలైంది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో పంత్(1 బ్యాటింగ్), విహారి(5 బ్యాటింగ్) ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లకు తోడుగా.. గ్రాండ్హోమ్, వాగ్నర్,సౌతీలు తలో వికెట్ పడగొట్టారు.
ప్రస్తుతం భారత్ 97 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో పంత్, విహారీ, లేక బౌలర్లు అద్భుతం చేస్తే తప్పా భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు. ఇక అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ ఓవర్నైట్ స్కోర్ 63/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. మహ్మద్ షమీ (4/81), జస్ప్రీత్ బుమ్రా (3/62) ధాటికి 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.