
ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్..
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే జంబో జట్టుతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్ మొదలు పెట్టనుంది. కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్తో పాటు నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కూడా పోటీ పడనుంది. ఓ డే నైట్ మ్యాచ్ కూడా ఉండే టెస్టు సిరీస్ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సిరీస్లో భారత్ విజయవకాశాలపైనే కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో విఫలమైతే గనుక విరాట్ కోహ్లీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విరాట్ కెప్టెన్సీపైనే విజయవకాశాలు..
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్లను ఎలా వాడుకుంటాడనేదానిపైనే భారత విజయావకాశాలు ఉంటాయని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తెలపడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. విరాట్ విఫలమైతే అతని కెప్టెన్సీపై వేటు తప్పదనే సూచనలు కనబడుతున్నాయి. దాదా మాటల్లో ఉన్న అంతరార్థం అదేనని విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా ఆసీస్ టూర్ గురించి ఇండియా టుడేతో మాట్లాడిన దాదా.. మైదానంలో విరాట్ కోహ్లీ తీసుకునే నిర్ణయాలపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని నొక్కి చెప్పాడు.

తుది జట్టు కోహ్లీ ఇష్టం..
‘నవదీప్ సైనీ తన పేస్లో మరింత మెరుగయ్యాడు. గతేడాది కంటే సైనీ బౌలింగ్లో పదును పెరిగింది. ప్రతీ ఒక్కరితో మంచి ప్రదర్శన చేయించడంపై కోహ్లీ వర్క్ చేయాల్సి ఉంది. కెప్టెన్గా అతనకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తాడు. ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంలో కోహ్లీదే తుది నిర్ణయం. బుమ్రా, సైనీ, ఇషాంత్ శర్మ, జడేజా, అశ్విన్ ఇలా ఎవర్ని తీసుకోవాలో అది కోహ్లీ ఇష్టం. అది కెప్టెన్సీ స్కిల్పై ఆధారపడి ఉంటుంది. విదేశాల్లో సిరీస్లు గెలవాలంటే బ్యాటింగ్లో రాణించడం ముఖ్యం. ఓపెనింగ్ జోడీ ఎవరనేది కూడా చాలా కీలకం'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

కివీస్ టూర్లో ఫ్లాఫ్..
గతేడాది విదేశాల్లో కూడా అదరగొట్టిన కోహ్లీసేన.. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైంది. టీ20 సిరీస్ వినహా వన్డే, టెస్ట్ సిరీసల్లో టీమిండియా క్లీన్ స్వీప్కు గురైంది. 5 టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన.. మూడు వన్డేల సిరీస్ను 3-0తో, రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో కోల్పోయింది. ఈ సిరీస్లో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ సిరీస్ కోహ్లీ కెరీర్లో అత్యంత చెత్తది. ఇక కోహ్లీ చివరిసారిగా సెంచరీ ఏడాది క్రితం చేశాడు. అది కూడా భారత్ ప్రతిష్టాత్మక డేనైట్ టెస్ట్లో బంగ్లాదేశ్పై సాధించాడు. ఈ పరిస్థితుల్లో ఆసీస్ టూర్లో కోహ్లీ విఫలమైతే.. అతని సారథ్యానికి ఎసరు తప్పదు.!
IPL 2020: సన్రైజర్స్కు సపోర్ట్గా తెలంగాణ సర్కార్.. దుర్గం చెరువు బ్రిడ్జి ఆరెంజ్ మయం!


Click it and Unblock the Notifications
