ధోనీనే సమాధానమిస్తాడు..
భారత జట్టుకు ధోనీ అందించిన సేవలు మరిచి ఏదేదో మాట్లాడుతున్నారని, వాటన్నిటికి త్వరలోనే మహీ సమాధానం చెబుతాడని ‘క్రికెట్ అడిక్టర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ‘ధోనీ ఖచ్చితంగా టీ20 ప్రపంచకప్ ఆడాలి. ప్రపంచకప్కు ముందే ఐపీఎల్ జరుగుతుందనుకుంటున్నా. అప్పుడే ధోనీ భాయ్ క్రేజ్ ఇన్నింగ్స్ చూడవచ్చు. అతను మౌనంగా ఉన్నాడని చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం చేయాలో మహీ బాయ్కు బాగా తెలుసు. ఎవరు ఏమన్నా.. ధోనీ దేశానికి సేవ చేస్తున్నాడు. ఆర్మీలో పని చేశాడు. రాజకీయాల్లోకి వెళ్లనని స్పష్టం చేశాడు. సేవ చేస్తానని కూడా చెప్పాడు.' అని శ్రీశాంత్ తెలిపాడు.
ధోనీలా భుజాలపై ఎత్తుకొని..
ఇక 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక విజయానంతరం వాంఖడే మైదానంలో నెలకొన్న ఉద్విగ్న క్షణాలు మళ్లీ టీ20 ప్రపంచకప్ విజయానంతరం రీ క్రియేట్ కావాలని శ్రీశాంత్ ఆకాంక్షించాడు. సచిన్ టెండూల్కర్ మాదిరి ధోనీని భుజాలపై ఎత్తుకోవడం చూడాలనుందన్నాడు. ‘ధోనీ భాయ్ నిర్ణయం తీసుకుంటే.. ఓ క్రికెట్ అభిమానిగా.. సచిన్ పాజీలా ధోనీ ప్రపంచకప్ గెలుచుకొని ఘన వీడ్కోలు అందుకోవాలనుకుంటున్నా. ఆటగాళ్ల భుజాలపై మహీ బాయ్ని ఎత్తుకొని సెండాఫ్ ఇవ్వడం చూడాలనుకుంటున్నా'అని శ్రీశాంత్ తన కోరికను వెళ్లడించాడు.
టీ20 ప్రపంచకప్ వాయిదా..
టీ20 వరల్డ్కప్ను ఐసీసీ వాయిదా వేయడంపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో సెప్టెంబరు - నవంబరు మధ్యలో ఐపీఎల్ 2020 సీజన్ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తుంది. చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్ నిర్వహించాలని కోరుకుంటున్నారు.
కేరళ రంజీ జట్టులో..
ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్పై బీసీసీఐ విధించిన ఏడేళ్ల నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధం ముగిసిన వెంటనే శ్రీశాంత్ను జట్టులోకి తీసుకోవాలని కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) నిర్ణయించింది. రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టు ప్రాబబుల్స్ జాబితాలో అతని పేరు చేర్చింది. శ్రీశాంత్ కూడా ఆ దిశగా కసరత్తులు ప్రారంభించాడు.