
ఫండ్ రైజింగ్ కోసం భారత్-పాక్ మ్యాచ్...
ఈ సంక్షోభ సమయంలో ఫండ్ రైజింగ్ కోసం తటస్థ వేదికగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్వహించాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు. దీని వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంతో పాటు ఆర్థిక సాయం లభిస్తుందని ఇండియా టుడే తో మాట్లాడుతూ అభిప్రాయడ్డాడు.
‘ఈ సంక్షోభ పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నా. ఈ మ్యాచ్ల ఫలితాలపై ఇరుదేశాల ప్రజలు కలత చెందరు. కరోనా కారణంగా జరుగుతున్న మ్యాచ్లనుకొని.. ఇరు దేశాల అభిమానులు ఆటను ఆస్వాదిస్తారు. కోహ్లీ సెంచరీ చేసినా పాక్ ప్రజలు.. బాబర్ శతకం బాదినా భారతీయులు సంతోషిస్తారు. మైదానంలో ఏం జరిగినా ఇరు జట్లు విజేతలుగా నిలుస్తాయి.'అని చెప్పుకొచ్చాడు.

దుబాయ్ వేదికగా నిర్వహించాలి..
ఇక ఇరు దేశాలు లాక్డౌన్లో ఉన్నందున ఈ సిరీస్ను తటస్థ వేదికైన దుబాయ్లో నిర్వహించాలని ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ సూచించాడు. ఈ సిరీస్తో ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు కూడా మెరుగవుతాయన్నాడు. అంతేకాకుండా ఆటగాళ్ల కోసం ఇరు దేశాల నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలన్నాడు.
‘ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఇంట్లోనే కూర్చుంటున్నారు. కాబట్టి ఈ ద్వైపాక్షిక సిరీస్కు భారీ స్పందన లభిస్తుంది. అలాగే ఇరు దేశాల సంబంధాలు మెరుగవుతాయి. మ్యాచ్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలి. ఈ మ్యాచ్ వ్యూయర్ షిప్ కూడా భారీగానే ఉంటుంది. అలాగే తొలి సారి ఇరు జట్లు ఒకరి కోసం ఒకరు ఆడినట్లవుతుంది. ఈ మ్యాచ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇరు దేశాల ప్రభుత్వాలకు సమానంగా అందజేయాలి.'అని అక్తర్ తన మనసులోని మాటను చెప్పాడు.
అఫ్రిది ఆల్టైమ్ టీమ్లో టీమిండియా ప్లేయర్ ఒక్కడే.. ధోనీ, కోహ్లీకి నో ప్లేస్!

2007 నుంచి పాక్తో ఆటల్లేవ్..
ఇక 2007 నుంచి పాకిస్థాన్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక పాకిస్థాన్తో 2019 వన్డే వరల్డ్కప్లో కోహ్లీసేన చివరిసారిగా ఆడింది. ఇక భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడూ జరిగినా వీపరీతమైన ప్రేక్షకాదరణ ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహిస్తే అవి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ను మించుతాయని ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications
