
రషీద్ను రఫ్ఫాడించాడు..
మైదానంలోకి దిగితే బౌలర్తో సంబంధం లేకుండా మొదటి బంతి నుంచి బాదుడు మొదలు పెట్టే గేల్.. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్, అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ను 2018 ఐపీఎల్ సీజన్లో చీల్చిచెండాడాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన గేల్.. సన్ రైజర్స్ బౌలర్ అయిన రషీద్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఈ విండీస్ వీరుడి ధాటికి ఆ మ్యాచ్లో రషీద్ పూర్తిగా తేలిపోయాడు. ఆ మ్యాచ్లో గేల్ 63 బంతుల్లోనే 11 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు.

రషీద్కు మూడింది..
తాజాగా నాటి ఇన్నింగ్స్ వివరాలను భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నిర్వహించిన ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' కార్యక్రమంలో కేఎల్ రాహుల్, గేల్ గుర్తుచేసుకున్నారు.
రాహుల్ మాట్లాడుతూ.. ‘2018 ఐపీఎల్లో క్రిస్ గేల్ ఆడిన ఓ విధ్వంసకర ఇన్నింగ్స్ నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్లో గేల్ పరుగుల ఆకలితో పాటు ఆగ్రహంగా ఉన్నాడు. విజయం కోసం రగిలిపోతున్నాడు. సన్రైజర్స్తో మ్యాచ్ కావడంతో నా దగ్గరకు వచ్చిన గేల్..‘రషీద్ ఖాన్ బౌలింగ్కు వస్తే.. ఈ రోజు అతన్ని ఖతమ్ చేస్తా. ఎందుకంటే స్పిన్నర్లు నన్ను డౌన్ చేయడం నాకు ఏమాత్రం నచ్చదు. ఈ రోజు రషీద్కు మూడింది.'అన్నాడు.
సింగిల్ తీసియమన్నాడు. రషీద్ ఖాన్ ఓవర్ మొత్తం ఆడుతానన్నాడు. క్రిస్ గేల్లో అలాంటి అటిట్యూడ్ చూడటం నాకదే తొలిసారి. అతను మంచి ప్రణాళికలతో ఉన్నాడు. ఆ రోజు గేల్ సెంచరీ చేసాడనుకుంటా'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఎప్పుడూ.. బ్యాటింగ్ కావాలంటాడు..
ఇక మంచి భాగస్వామ్యాన్ని అందించే క్రమంలో ఏం మాట్లాడుకున్నారని హోస్ట్ మయాంక్ ప్రశ్నించగా.. రాహుల్ ఎప్పుడు స్ట్రైకింగ్ కావలంటాడని గేల్ చెప్పుకొచ్చాడు. ‘మధ్యలో మేం ఏం మాట్లాడుకున్నామో నీకు తెలుసా? రాహుల్ ఎప్పుడూ స్ట్రైక్ కావాలంటాడు. ‘డోంట్ వర్రీ బాస్.. నేను చూసుకుంటా'అని చెబుతుంటాడు. ఎప్పుడూ బ్యాటింగ్ కావాలంటాడు'అని గేల్ తెలిపాడు.

15 రన్స్తో గెలుపు..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గేల్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవరల్లో4 వికెట్లకు 178 పరుగులే చేసి 15 పరుగులతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన రషీద్ 55 పరుగులు సమర్పించుకున్నాడు.


Click it and Unblock the Notifications
