
న్యూఢిల్లీ: 2019 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పడం ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీ ముందు వరకు వరల్డ్ కప్ ప్రాబబుల్స్లో ఉన్న రాయుడిని ఆఖరి క్షణంలో తప్పించి విజయ్ శంకర్కు అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సమర్ధవంతంగా చేయగల త్రీ డైమన్షన్ ఆటగాడని అప్పటి భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నాడు.
ఇక తనను ఎంపిక చేయకపోవడం పట్ల రాయుడు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడు. త్రీడీ గ్లాస్తో శంకర్ ఆట చూస్తానని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ కామెంట్స్ కారణంగానే శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడ్డా వారి స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయాడు. రాయుడిని కాదని సెలెక్టర్లు రిషభ్ పంత్, మయాంక్ అగర్వాల్ను ఇంగ్లండ్కు పంపించారు. టాపార్డర్ బలంతోనే సెమీస్కు చేరిన భారత్.. న్యూజిలాండ్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. దాంతో కోహ్లీసేన నిరాశగా వెనుదిరిగింది. రాయుడి వంటి అనుభవపూర్వకమైన ఆటగాడు జట్టులో ఉంటే భారత్ ఆ మ్యాచ్ గెలిచేదనే అభిప్రాయం కలిగింది.
అయితే తనను మొత్తానికి పక్కన పెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురైన రాయుడు.. సెలెక్టర్లపై కోపంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న
చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ రాయుడికి ఫోన్ చేసి మాట్లాడాడని ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. 'రాయుడు..ఇంకా క్రికెట్ ఆడే సత్తా నీలో ఉంది. రిటైర్మెంట్ నిర్ణయంపై మరోసారి ఆలోచించు. చెన్నై సూపర్ కింగ్స్తో అనుబంధం కొనసాగించు'రాయుడికి సర్ధిచెప్పినట్లు తెలిపింది. ఈ కాల్ వచ్చిన నెలరోజులకే రాయుడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడని పేర్కొంది.
లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్పై దృష్టిసారించిన రాయుడు.. ముంబై ఇండియన్స్తో శనివారం జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో అద్భుత హాఫ్ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్నందించాడు. 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అనుభవపూర్వకమైన ఆట తీరుతో విజయం ముంగిట నిలిపాడు. దీంతో రాయుడు త్రీడీ గ్లాస్ కామెంట్ మరోసారి హాట్ టాపిక్ అయింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్కు ఆడుతున్న విజయ్ శంకర్ దారుణంగా విఫలమవడంతో అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.