నా కళ్లను నమ్మలేకపోయాను..
2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత అభిమానులంతా టీమ్ బస చేసిన హోటల్కు పోటెత్తారని తెలిపాడు. విజయానందంలో ఆడుతూ పాడుతూ చిందేశారని, వారి సంతోషానికి హద్దులే లేకుండా పోయిందని గుర్తు చేసుకున్నాడు.
‘2007 ప్రపంచకప్ సెమీఫైనల్ విజయానంతరం చోటుచేసుకున్న పరిణామాలు నాకింకా గుర్తున్నాయి. మా హోటల్ అభిమానులతో పూర్తిగా నిండిపోయింది. వాళ్లంతా గెలిచిన ఆనందంలో చిందేశారు. ఆ క్షణానా నా కళ్లను నేను నమ్మలేకపోయాను. అప్పటి వరకు అలాంటి పరిస్థితులను నేను చూడలేదు. మైదానంలో అభిమానులను చూడటం సర్వసాధారణమే. కానీ హోటల్కు పొటెత్తడమే ఆశ్చర్యం కలిగించింది. అప్పుడే అభిమానుల ప్రేమే జట్టును ముందుకు నడిపిస్తుందని భావించా'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
15 పరుగులతో విజయం..
ఇక నాటి సెమీఫైనల్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత్ 15 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యువరాజ్ సింగ్(30 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 70), ధోనీ(18 బంతుల్లో 1 సిక్సర్ 4 ఫోర్లతో 36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ శర్మ 8 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అనంతర ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మాథ్యూ హెడెన్(62), ఆండ్రూ సైమండ్స్(43) పోరాడిన ఫలితం లేకపోయింది. శ్రీశాంత్, పఠాన్, జోగిందర్ శర్మ చెరో రెండు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు.
ఫైనల్లో పాక్పై గెలిచి..
అనంతరం పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్నందుకొని విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2007 వన్డే ప్రపంచకప్లో చిత్తుగా ఓడిన భారత్.. టీ20 వరల్డ్కప్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి విజయం సాధించింది. బీసీసీఐ కూడా పెద్దగా పట్టించుకోని ఈ టోర్నీకి ధోనీ సారథ్యంలోని యువ ఆటగాళ్లనే పంపించింది.