
న్యూఢిల్లీ: అఫ్గాన్ యువ సంచలనం, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా అతని తల్లి గురువారం మరణించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న రషీద్ ఖాన్.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
'అమ్మా.. నువ్వే నా సర్వస్వం. నువ్వు లేకుండా నేను లేను. ఇక నాతో ఉండవనే విషయాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్సవుతానమ్మా.. నీ ఆత్మకు శాంతికలగాలి' అని రషీద్ ట్వీట్ చేశాడు.
అఫ్గానిస్థాన్ టీమ్లో అగ్రస్థాయి స్పిన్నర్గా కొనసాగుతున్న 21 ఏళ్ల రషీద్ ఖాన్.. ఇటీవల ఆ జట్టు సారథ్య బాధ్యతలు కూడా అందుకున్నాడు. కానీ రోజుల వ్యవధిలోనే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు అస్గర్ అఫ్గాన్ను కెప్టెన్గా నియమించింది. ఇప్పటి వరకూ అఫ్గాన్ తరఫున 4 టెస్టులు, 71 వన్డేలు, 48 టీ20 మ్యాచ్లు ఆడిన రషీద్ ఖాన్.. 245 వికెట్లు పడగొట్టాడు.
నిజానికి రషీద్ ఖాన్ ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడు. 2017 ఐపీఎల్ సీజన్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న రషీద్.. ఎన్నో మ్యాచ్ల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. సన్రైజర్స్ తరఫున ఇప్పటి వరకూ 46 మ్యాచ్లాడిన రషీద్ ఖాన్.. 6.55 ఎకానమీతో ఏకంగా 55 వికెట్లు పడగొట్టాడు.