హలో ధోనీ ఫ్యాన్స్.. మీవోడి ఫస్ట్ వికెట్ నేను కాదు: కెవిన్ పీటర్సన్

లండన్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా అతని ఫ్యాన్స్కు ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్మన్ కేవిన్ పీటర్సన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. అందరూ అనుకుంటున్నట్లు టెస్టు క్రికెట్లో ధోనీ తొలి వికెట్ తాను కాదన్నాడు. అద్భుత కెరీర్ కలిగిన మహీకి రిటైర్మెంట్ క్లబ్కు స్వాగతమని తెలిపాడు. శనివారం మహీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పీటర్సన్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. ధోనీకి శుభాకాంక్షలు తెలిపాడు.

రిటైర్డ్ క్లబ్కు వెల్కమ్..
‘ధోనీ నాకు మంచి మిత్రుడు. అతడి కెరీర్ చాలా గొప్పగా సాగింది. అదొక మ్యాజికల్ కెరీర్ అని చెప్పొచ్చు. అలాంటి కెరీర్ పట్ల గర్వంగా ఉండాలి. ధోనీ ఆట చూడటానికి భారత దేశంతో పాటు క్రికెట్ ప్రపంచం కూడా అదృష్టం చేసుకుంది. అయితే, ఇప్పుడు నీ క్రికెట్ కెరీర్ పూర్తయిన సందర్భంగా ఒక విషయం చెప్పాలి. లార్డ్స్ టెస్టులో నన్ను ఔట్ చేశావని, టెస్టుల్లో నేను నీకు తొలి వికెట్ అని.. నువ్వూ, నీ అభిమానులు నన్నెప్పుడూ అంటుంటారు. కానీ అది జరగలేదని నీకూ నాకు తెలుసు. నువ్వు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ విషయంపై స్పష్టతనిస్తున్నా. అదెప్పుడూ జరగలేదు. ఏదైమైనా అద్భుతమైన కెరీర్కు కంగ్రాట్స్. మా రిటైర్మెంట్ క్లబ్లోకి స్వాగతం' అని తెలిపాడు.

అసలేం జరిగిందంటే..
2011లో లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో ధోనీ బౌలింగ్ చేశాడు. అప్పుడు ఇంగ్లండ్ 217/3 స్కోర్ వద్ద పీటర్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ధోనీ వేసిన ఒక బంతిని ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. అంపైర్ దాన్ని తిరస్కరించాడు. తర్వాత మరో బంతికి పీటర్సన్ వికెట్ల వెనుక దొరికిపోయాడు. ధోనీతో పాటు అందరూ అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. దానికి పీటర్సన్ సమీక్షకు వెళ్లడంతో నాటౌట్గా తేలింది. అయినా, అప్పటి నుంచి ధోనీ, అతడి అభిమానులు పీటర్సన్ను పలు సందర్భాల్లో ఆటపట్టించారు. ధోనీకి టెస్టుల్లో అతడే తొలి వికెట్ అని సరదాగా అంటుంటారు.

ఐపీఎల్లో ధోనీ కూడా..
ఇక ధోనీ కూడా తన ఫస్ట్ టెస్ట్ వికెట్ పీటర్సేనని ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా చమత్కరించాడు. ధోనీ కన్నా తానే బెస్ట్ గోల్ఫ్ ప్లేయర్నని పీటర్సన్ అనగా.. ఇప్పటికీ పీటర్సనే తన టెస్ట్ ఫస్ట్ వికెట్ అని ధోనీ బదులిచ్చాడు. దీంతో అభిమానులు కూడా సమయం దొరికినప్పుడల్లా పీటర్సన్ను ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ స్పందిస్తూ ధోనీ తననెప్పుడూ ఔట్ చేయలేదని అభిమానులకు స్పష్టం చేశాడు.

కెరీర్లో ఒకే ఒక వికెట్..
ఇక ధోనీ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఒకే ఒక వికెట్ తీసాడు. అది కూడా 2009 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తీశాడు. 300కు పైగా మ్యాచ్ల్లో భారత జట్టుకు సారథ్యం వహించిన ధోనీ.. మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. తద్వార ఈ ఘనతను అందుకున్న కెప్టెన్గా చరిత్రకెక్కాడు. ఇక ధోనీ చడిచప్పుడు లేకుండా సింపుల్గా ఓ ఇన్స్టా పోస్ట్తో రిటైర్మెంట్ ప్రకటించాడు. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను షేర్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!