ఇంతకేం జరిగిందంటే..?
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా లుంగి ఎంగిడి వేసిన 19వ ఓవర్ మూడో బంతిని ఆ జట్టు బ్యాట్స్మన్ జేమ్స్ పాటిన్సన్ డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. అయితే ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న దీపక్ చాహర్ పరుగెత్తుకుంటూ వచ్చి మరి బంతిని వదిలేసాడు. అతని కాళ్ల మధ్యలో నుంచే బంతి బౌండరీకి వెళ్లింది. చాలా సులువుగా ఆపాల్సిన బంతిని మిస్ చేయడం ధోనీకి కోపం తెప్పించింది. అయితే అప్పటికే ముంబై ఏడు వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ ఫోర్ ఆ జట్టుకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో మరింత చిర్రెత్తుకుపోయిన మహీ.. చాహర్పై తన హవాభావాలతోనే అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక చాహర్ మిస్ ఫీల్డ్ చేయాగానే టీవీ కెమెరాలు కూడా మహీ రియాక్షన్ కోసం ఫోకస్ చేశాయి.
లాక్డౌన్ ఎఫెక్ట్..
కరోనా కారణంగా వచ్చిన 6 నెలల గ్యాప్తో ఆటగాళ్లు లయ తప్పారు. ముఖ్యంగా ఫీల్డింగ్లో తడబడ్డారు. ఇరు జట్లలోనూ ఇదే సమస్య కనిపించింది. కానీ ముంబైతో పోల్చితే చెన్నై ఫీల్డింగ్ కాస్త బెటరే. సీఎస్కే ప్లేయర్ ఫాఫ్ డూప్లెసిస్ బౌండరీ లైన్ వద్ద రెండు అద్భుత క్యాచ్లు అందుకొని ముంబై దూకుడుకు కళ్లెం వేసాడు. ఈ రెండు క్యాచ్లు మ్యాచ్కే హైలైట్ అయ్యాయి. ఇక ముంబై ఇండియన్స్ అయితే చెత్త ఫీల్డింగ్ మూల్యం చెల్లించుకుంది. పదేపదే క్యాచ్లు వదిలేశారు. అంబటి రాయుడుకు లైఫ్ ఇచ్చారు. డూప్లెసిస్ క్యాచ్లు చేజార్చారు. పరుగులు వదిలేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా జట్టంతా మిస్ ఫీల్డ్ చేసింది. అలాగే ఫిట్నెస్ విషయంలోనూ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. 6 నెలలు ఇంట్లోనే కూర్చోవడంతో అందరూ బరువు పెరిగారు. మరి ముఖ్యంగా పొట్టలు పెంచారు.
అదరగొట్టిన రాయుడు..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 రన్స్ చేసింది. సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 42), క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. చాహర్, జడేజా రెండేసి వికెట్ల పడగొట్టారు. చావ్లా, సామ్ కరన్లకు చెరొక వికెట్ లభించింది.
అనంతరం చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 71), ఫాఫ్ డూప్లెసిస్( 44 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్), సామ్ కరన్(6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 18)మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన్, పాండ్యా, చాహర్, బుమ్రా తలో వికెట్ తీశారు.