ఆసీస్ పయనం..
ఆదివారం జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపకంచకప్ ఫైనల్లో భారత్తో ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు స్టార్క్ శనివారం మెల్బోర్న్ బయల్దేరనున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో జరిగే చివరి వన్డే కు అతను అందుబాటులో ఉండడం లేదు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే సౌతాఫ్రికా 2-0తో సిరీస్ను గెలుచుకుంది.. చివరి వన్డే నామమాత్రమే కావడంతో స్టార్క్ మెల్బోర్న్ వెళ్ళడానికి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతిచ్చింది.
ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్
జీవితంలో లభించే ఒకే ఒక అవకాశం..
ప్రపంచకప్ ఫైనల్లో తన సతీమణి అలీసా ఆటను చూడటం మిచెల్కు జీవితంలో లభించే ఒకే ఒక అవకాశమని, అందుకే ఆమెకు మద్దుతగా నిలిచేందుకు, అద్భుతమైన మ్యాచ్ చూడటానికి అతన్ని అనుమతిచ్చామని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. పైగా అతను తీరిక లేని షెడ్యూల్తో వరుస సిరీస్లు ఆడుతూ తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నాడని తెలిపాడు. తమ కన్నా ముందే స్టార్క్ ఇంటికి చేరుకోవడం వల్ల అతనికి కొంత విశ్రాంతి లభిస్తుందని చెప్పుకొచ్చాడు. తమ జట్టులో పేసర్లకు కొదవలేదని, అతని గైర్హాజరీతో మరొకరికి అవకాశం లభిస్తుందన్నాడు.
టైటిలే లక్ష్యంగా..
ఇక టీ 20వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి సారి ఈ మెగా టోర్నీలో భారత్ ఫైనల్ చేరుకుంది. మహిళల దినోత్సవం నాడే జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత మహిళలు చిరస్మరణీయ విజయాన్నందుకోవాలని యావత్ భారతం ఆకాంక్షిస్తోంది. అందరి నమ్మకాన్ని నిలబెడుతూ.. హర్మన్ ప్రీత్ కౌర్ సేన చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి. మరో వైపు టీ 20 ప్రపంచ కప్ లో వరసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా మహిళల టీం సొంత గడ్డ పై కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది.