ఎమ్మెస్కే వల్లే విహారీకి ఛాన్స్.. సెలక్షన్ సమావేశాలు లైవ్ ఇవ్వాలి: మనోజ్ తివారీ

ముంబై: టీమిండియా సెలక్షన్ కమిటీ తీరుపై భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ మండిపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన ఆటగాళ్లకే మేలు కలుగుతుందని విమర్శించాడు. సెలక్షన్ కమిటీ వైఫల్యం వల్లే గతేడాది వరల్డ్కప్లో భారత్ ఓడిపోయిందన్న తివారీ... నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో నాలుగో నంబర్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిందని అసహనం వ్యక్తం చేశాడు.భారత జట్టు ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందో? లేదో? తెలియాలంటే సెలెక్షన్ కమిటీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఈ బెంగాల్ క్రికెటర్ డిమాండ్ చేశాడు.

అందుకే విహారీకి చాన్స్..
ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించినప్పుడు కనీసం అతనికైనా కారణం చెప్పాలని కోరాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్ర వ్యక్తి కాబట్టి హనుమ విహారికి, వెస్ట్జోన్కి చెందిన వ్యక్తి అధికారంలో ఉండగా వసీమ్ జాఫర్కు, నార్త్జోన్ వ్యక్తి సెలెక్టర్గా ఉన్న కాలంలో గురుకీరత్ సింగ్, రిషీ ధావన్లకు అవకాశాలు వచ్చాయని తివారీ ఆరోపించాడు.

ఈ మాటలు చెప్పలేరు..
ప్రత్యక్ష ప్రసారం వల్ల ఏ సెలెక్టర్ ఏ ఆటగాడికి ఎందుకు మద్దతు పలుకుతున్నాడో అందరికీ తెలుస్తుంది. సాధారణంగా ఓ ఆటగాడు తనను ఎందుకు ఎంపిక చేయలేదని ఏ సెలెక్టర్నైనా అడిగితే వేరే సెలెక్టర్ వ్యతిరేకించాడని ఒకరిపై ఒకరు చెబుతుంటారు. ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఇలాంటి మాటలు చెప్పడానికి వాళ్లకు అవకాశం ఉండదు' అని మనోజ్ అభిప్రాయపడ్డాడు.

టాపార్డర్లో మనోళ్లనే ఆడించాలి..
ఇక, ఐపీఎల్ గురించి మాట్లాడుతూ ఈ లీగ్ వల్ల భారత క్రికెటర్ల కంటే విదేశీ బ్యాట్స్మెన్కే ఎక్కువ మేలు జరుగుతుందని మనోజ్ అన్నాడు. తొలి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం విదేశీ ఆటగాళ్లకే అధికంగా వస్తుండడంతో వారు చెలరేగుతున్నారని..ఐసీసీ టోర్నమెంట్లలో ఇది వారికి లాభిస్తుందని తెలిపాడు. ఆరేడు స్థానాల్లో భారత యువ ఆటగాళ్లను బరిలోకి దింపడం వల్ల వారు స్వేచ్ఛగా ఆడలేక ఒత్తిడికి లోనై విఫలమవుతున్నారని మనోజ్ చెప్పాడు.

టాప్-4లో చాన్స్ ఇవ్వాలి..
భారత ఆటగాళ్లను టాపార్డర్లో ఆడించే అవకాశాలపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టి సారించాలన్నాడు. తానేమీ వీదేశీ ఆటగాళ్లకు వ్యతిరేకం కాదని, కానీ మన ఆటగాళ్లకు ప్రయోజనం దక్కడం లేదన్నాడు. ‘ఐపీఎల్లో ప్రస్తుతం టాప్-4లో చాలా కొద్ది మంది భారత ఆటగాళ్లు మాత్రమే ఆడుతున్నారు. చాలా జట్లు టాపార్డ్లో విదేశీ ఆటగాళ్లనే బరిలోకి దింపుతున్నాయి. ఇక్కడి పరిస్థితులు, మన బౌలర్లు, స్పిన్ను ఆకలింపు చేసుకుంటున్న వారు ఐసీసీ టోర్నీల్లో చెలరేగుతున్నారు.'అని భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడిన మనోజ్ తెలిపాడు. ఇక సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్ సెలెక్టర్ల తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
క్రికెట్లో ఆ నిబంధనను మార్చాలి: సచిన్ టెండూల్కర్