సెప్టెంబర్లో ఐపీఎల్..
ఐపీఎల్ 2021లో 29 మ్యాచులు ముగిశాక కోల్కతా ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్.. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. హైదరాబాద్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. చెన్నై కోచ్లు లక్ష్మీపతి బాలాజీ, మైక్ హస్సీ కరోనా వైరస్ బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ క్యాష్ రిచ్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. అయితే మిగిలిన 31 మ్యాచులు నిర్వహించేందుకు సరైన సమయం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. టీ20 ప్రపంచకప్ ముందు సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
12 నెలల్లో 15 క్రికెట్ సిరీస్లు రద్దు.. ఎక్కడి గత్తరనో ఏమో దీని పీనుగెల్ల!
న్యూజిలాండ్ ప్లేయర్లు దూరం..
బీసీసీఐ ముందున్న ఖాళీ విండో కూడా అదే. దాంతో ఆ నెలలోనే మళ్లీ ఐపీఎల్ పట్టాలెక్కనుందనే చర్చ ఊపందుకుంది. అయితే సెప్టెంబర్లో న్యూజిలాండ్ యూఏఈ వేదికగా పాకిస్థాన్తో ఆడనుంది. దాంతో ఐపీఎల్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (ఎస్ఆర్హెట్), కైల్ జెమీసన్(ఆర్సీబీ), జిమ్మీ నీషమ్(ముంబై ఇండియన్స్), లాకీ ఫెర్గూసన్(కేకేఆర్), ఫిన్ అలెన్(ఆర్సీబీ), మిచెల్ సాంట్నర్(ఆర్సీబీ), టిమ్ సీఫెర్ట్(కేకేఆర్) ఐపీఎల్ సెకండాఫ్కు దూరం కానున్నారు.
కేన్ మామ కీలకం..
లీగ్ వాయిదా పడేముందే కేన్ విలియమ్సన్ను సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ప్రమోషన్ ఇవ్వగా.. కైల్ జెమీసన్ రూ.15 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ తీసుకుంది. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడే సమయానికి రిషభ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్ల్లో 6 గెలిచింది. ఇక కేన్ విలియమ్సన్ టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ అట్టడుగున నిలిచింది. 7 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక విజయాన్నందుకుంది.
ఇంగ్లండ్ ప్లేయర్లు దూరం..
ఐపీఎల్ 2021 సీజన్ను ఎప్పుడు రీషెడ్యూల్ చేసినా ఇంగ్లండ్ ప్లేయర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ యాష్లే జైల్స్ తెలిపాడు. ఇంగ్లండ్ టీమ్కు ఉన్న బిజీ షెడ్యూలే ఇందుకు కారణమన్నాడు. 'మా ప్లేయర్లను ఇంగ్లండ్కే ఎక్కువ ఆడేలా చూస్తున్నాం. ఎఫ్టీపీ ప్రకారం మా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది.
పాక్, బంగ్లా టూర్లు ఉంటే మా ప్లేయర్లు అక్కడికి వెళతారు. ఐపీఎల్ మళ్లీ ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ న్యూజిలాండ్ సిరీస్తో మొదలయ్యే మా సమ్మర్ సీజన్ చాలా బిజీగా ఉండనుంది. ఇండియాతో టెస్ట్ సిరీస్ తర్వాత హండ్రెడ్ టోర్నీ ఉంటుంది. ఇక టీ20 వరల్డ్కప్, యాషెస్ ఉండనే ఉన్నాయి'అని జైల్స్ పేర్కొన్నాడు.