
మలుపు తిప్పిన ముస్తాఫిజుర్
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ రాహుల్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 67) మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 71 బంతుల్లోనే 120 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు వెనువెంటనే ఔటైనా.. నికోలస్ పూరన్(32), ఎయిడెన్ మార్క్రమ్(26 నాటౌట్)కూడా ఆ జోరును కొనసాగించారు. దాంతో పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 8 రన్స్ కావాల్సి వచ్చింది. దాంతో రాహుల్ సేన విజయం లాంఛనమేనని అంతా భావించారు. కామెంటర్లు కూడా మ్యాచ్ ఒక ఓవర్ ముందుగానే ముగుస్తుందని చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడే ముస్తాఫిజుర్ మ్యాజిక్ చేశాడు. తాను వేసిన 19వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముస్తాఫిజుర్ ఇలా కట్టడి చేస్తాడని ఎవరూ ఊహించలేదు. తనకే సాధ్యమైన వైడ్ యార్కర్లతో పంజాబ్ బ్యాట్స్మన్కు కళ్లెం వేసాడు. దాంతో మ్యాచ్ ఆఖరి ఓవర్కు చేరింది. సాధారణంగానే ఒత్తిడికి చిత్తయ్యే పంజాబ్ మళ్లీ అదే చేసి సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది.
SRH Playing 11: వార్నర్ ఇన్.. హోల్డర్ డౌట్.. ఢిల్లీతో బరిలోకి దిగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!

చివరి వరకు తీసుకెళ్లి..
ఈ మ్యాచ్లో పంజాబ్ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు భారీ భాగస్వామ్యం అందించినా ఆ జట్టు గెలవలేకపోయింది. అసలు మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లే ఘోర తప్పిదం చేసింది. ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్లోనే ముగించాల్సింది. కనీసం బాల్ టూ బాల్ సింగిల్స్ తీసినా రాజస్థాన్పై ఒత్తిడి ఉండేది. అదేం చేయకుండా భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేయడం.. చేయాల్సింది తక్కువ పరుగులే కదా? అనే అలసత్వం ఆ జట్టు కొంప ముంచింది. ఇక్కడ రాజస్థాన్ ఆటగాళ్ల పోరాట స్పూర్తి, సంజూ శాంసన్ కెప్టెన్సీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. 'మ్యాచ్ ముగిసిపోలేదు.. చివరి బంతి వరకు పోరాడాలి'అని సంజూ శాంసన్ తన సహచర ఆటగాళ్లకు పదే పదే చెప్పడం స్టంప్స్ మైక్లో రికార్డు అయింది. ఆరంభంలో కొంత మిస్ ఫీల్డ్ చేసినా.. స్లాగ్ ఓవర్లో అదరగొట్టింది. ఇక పంజాబ్ నిదానంగా బాల్ టు బాల్ సింగిల్ తీసినా.. ముందే ఓ బౌండరీ బాదినా సునాయసంగా గెలిచేది.

లాస్ట్ ఓవర్ రెండు వికెట్లు..
చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 4 పరుగులు కావాలి. అండర్-19 క్రికెట్ నుంచి వచ్చిన యువ బౌలర్ బంతిని అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 4 పరుగులు పెద్ద విషయమే కాదు. కానీ పంజాబ్ ఒత్తిడిని అధిగమించలేకపోయింది. పైగా నికోలస్ పూరన్, దీపక్ హుడా వికెట్లను కోల్పోయింది. ఇదే ఆ జట్టు ఓటమిని శాసించింది. ఈ ఓవర్ ఫస్ట్ బాల్ ఆడిన మార్కరమ్ డాట్ చేశాడు. ఆ తర్వాత సింగిల్ తీసిచ్చాడు. ఆ తర్వాత పూరన్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక్కడే మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడ్ ఓ బంతిని వృథా చేసి మరో బంతికి ఔటయ్యాడు. అతను సింగిల్ తీసే ప్రయత్నం చేయలేదు. సింగిల్ తీసి మార్క్రమ్కు స్ట్రైక్ ఇచ్చుంటే ఫలితం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే అతను క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఏది ఏమైనా పంజాబ్ బ్యాట్స్మన్ అలసత్వంతోనే ఓటమికి తలవంచింది.

చివరివరకు ఆడకపోవడం..
టీ20 క్రికెట్లో బిగ్ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మన్ చివరి వరకు ఉండటం చాలా ముఖ్యం. పొట్టి ఫార్మాట్లో ఆఖరి బంతి వరకు విజయాన్ని నిర్ణయించలేం. 120 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వెనువెంటనే ఔటవ్వడం పంజాబ్ కొంపముంచింది. క్రీజులో నిలదొక్కుకున్న ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కడవరకు ఉన్నా పంజాబ్ విజయం సులువయ్యేది. కానీ ఈ తప్పిదాన్ని పంజాబ్ ఇంకా సరిచేసుకోవడం లేదు. గతేడాది కూడా ఇదే తరహా ప్రదర్శనతో విజయం ముంగిట పంజాబ్ చేతులెత్తేసింది. రెండు సూపర్ ఓవర్లు ఆడిన చరిత్ర కూడా ఆ జట్టుకు ఉంది.


Click it and Unblock the Notifications
