రైనా.. నిన్ను మిస్సవుతున్నాం..
ఈ నేపథ్యంలో రైనా వైదొలగడంపై స్పందిస్తూ షేన్ వాట్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. 'వ్యక్తిగత కారణాల వల్ల రైనా భారత్కు తిరిగి వెళ్లాడనే చేదు వార్తతో ఈరోజు నిద్రలేచా. ఇప్పుడతడు బాగానే ఉన్నాడని అనుకుంటున్నా. రైనా..చెన్నై సూపర్ కింగ్స్ నిన్ను కచ్చితంగా మిస్ అవుతుంది. తొలి నుంచీ ఈ జట్టుతోనే కలిసి ఉన్నావు. నువ్వు ఈ జట్టు గుండెచప్పుడివి. నువ్వు కూడా ఐపీఎల్ను మిస్సవ్వనున్నావు. నువ్వో ఐపీఎల్ స్టార్వి. కానీ ఈ జట్టు ఎప్పుడూ నీ శ్రేయస్సే కోరుకుంటుంది. నీకు అంతా బాగుండాలని కోరుకుంటున్నా.'అని తెలిపాడు.

జాగ్రత్తగా ఉండాల్సిందే..
ఇక జట్టులో కరోనా సోకిన విషయంపై స్పందిస్తూ.. మళ్లీ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండడం ఆసక్తిగా ఉందన్నాడు. ‘మరో ఏడు రోజులు క్వారంటైన్లో ఉండటం ఆసక్తికరంగా ఉంది. కానీ ప్రస్తుతం మనం ఏం చేయలేని కఠిన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతీ ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్. ఇలాంటి మెగా టోర్నీలో కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. ఐపీఎల్ జరగడం కోసం మేం ఏదైనా చేస్తాం. భవిష్యత్లో టోర్నీ సజావుగా సాగాలి'అని వాట్సన్ ఆకాంక్షించాడు.

ఆటగాళ్ల నిర్లక్ష్యమే..
చెన్నై జట్టులో కరోనా కేసులు పెరగడానికి ఆటగాళ్ల నిర్లక్ష్యం , చెన్నైలో ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించడం కారణమని ఇతర ఫ్రాంచైజీలు ఆరోపిస్తున్నాయి. ఈనేపథ్యంలో వారిని గట్టిగా హెచ్చరించాలని బీసీసీఐని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. అన్ని జట్లు కూడా మాస్కులు, భౌతిక దూరాన్ని పాటిస్తే సీఎస్కే ఆటగాళ్లు ఇవేమీ లేకుండానే స్వేచ్ఛగా తిరిగారని చెబుతున్నాయి. దీనికితోడు రెండు వారాల క్రితం చాహర్ సోదరుల మధ్య ట్వీట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మాస్కులు, భౌతిక దూరం ఎందుకు పాటించడం లేదని రాహుల్ చాహర్ అడిగితే.. అందరం రెండుసార్లు నెగెటివ్గా తేలాం.. ఇక మాస్కులెందుకు అని దీపక్ సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఆ దీపక్ చాహరే కరోనా బారిన పడ్డాడు.

13 మందికి కరోనా..
ఇదిలా ఉండగా, ప్రస్తుతం చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడినట్లు బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారంతా ఇప్పుడు ప్రత్యేకంగా ఐసోలేషన్లో ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. అలాగే నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పింది. కొద్ది రోజుల్లో మళ్లీ నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్గా వస్తేనే వారిని బయో బుడగలోకి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఏదేమైనా యూఏఈలో ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఆటగాళ్లు ఇలా వైరస్ బారిన పడటం ఆందోళనగానే ఉంది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications

ఆ రోజు సాయం చేయకుంటే రోహిత్ శర్మ అనేవాడు ఉండేవాడు కాదు










