కష్టాల్లో ఉన్న ధోనీసేనకు గట్టి షాక్.. గాయంతో స్టార్ ఆల్రౌండర్ ఔట్

దుబాయ్: ఐపీఎల్-2020 సీజన్లో ఊహించని విధంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే 9 మ్యాచ్ల్లో 6 ఓడి ప్లే ఆఫ్ ఆశలను ఆవిరి చేసుకున్న ధోనీసేన.. తదుపరి మ్యాచ్ల్లో స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సేవలను కోల్పోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆఖరి ఓవర్లో చెన్నై ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో బ్రావో గాయపడ్డాడు. దాంతో ఆఖరి ఓవర్ వేయకుండానే మైదానం వీడాడు.
ఇది చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ అనంతరం బ్రావో గాయమైందని చెప్పిన ధోనీ అతని ఇంజ్యూరి తీవ్రతపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే బ్రావో కుడి గజ్జలో గాయం అవడంతోనే ఆకస్మికంగా మైదానాన్ని వీడాడని, అతను కొన్ని మ్యాచ్ల పాటు మైదానంలోకి దిగే అవకాశం లేదని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ స్పష్టం చేశాడు.

బ్రావో బాధపడ్డాడు
‘బ్రావోకు కుడి గజ్జలో గాయమైనట్లు తెలుస్తోంది. అతని గాయం తీవ్రంగానే ఉంది. కొన్ని మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది జట్టుకు నిరాశకలిగించే విషయమే. ఇక ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయకపోవడంపై బ్రావో కూడా చాలా బాధపడుతున్నాడు. అయితే అతను ఎన్ని మ్యాచ్లకు దూరమవుతాడు, ఎన్నివారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందనే విషయంపై రేపు( ఆదివారం) క్లారిటీ వస్తుంది.'అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఫిట్నెస్ సమస్యలతోనే బ్రావో ఆరంభ మ్యాచ్లకు కూడా దూరమయ్యాడు.

ఆఖరి ఓవర్ జడేజాతో..
ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా.. ధోనీ బంతిని రవీంద్ర జడేజాకు ఇచ్చాడు. ఈ ఓవర్లో అక్షర్ పటేల్(5 బంతుల్లో 3 సిక్స్లతో 21 నాటౌట్) మూడు సిక్స్లు కొట్టడంతో గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై ఓటమిపాలైంది. బ్రావోను కాకుండా జడేజాతో బౌలింగ్ చేయించి ధోనీ తప్పిదం చేశాడని మ్యాచ్ చూసిన ప్రతీఒక్కరు అనుకున్నారు. బ్రావోతో బౌలింగ్ చేయించి ఉంటే చెన్నై గెలిచేదని కూడా అభిప్రాయపడ్డారు. ధోనీ నిర్ణయంపై కూడా అసహనం వ్యక్తం చేశారు.

ఆప్షన్ లేకపోవడంతో..
మరో ఆప్షన్ లేకపోవడంతోనే రవీంద్ర జడేజాతో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయించానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. బ్రావో ఫిట్గా లేకపోవడంతో ముందుగానే మైదానం వీడాడని, ఆఖరి ఓవర్ వేయించడానికి తన ముందు జడేజా, కరన్ శర్మ మాత్రమే ఉన్నారని, తాను జడ్డూకు బంతినిచ్చానని మహీ తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘బ్రావో ఫిట్గా లేడు. అతను ముందే మైదానం వీడాడు. మళ్లీ రాలేదు. ఆఖరి ఓవర్కు నా ముందున్న ఆప్షన్ జడ్డూ,కర్ణ్ మాత్రమే. నేను జడేజాతో బౌలింగ్ చేయించా. అతి ప్రధానమైన శిఖర్ ధావన్ వికెట్ తీయలేకపోయాం. అతను ఇచ్చిన పలు అవకాశాలను చేజార్చం.'అని ధోనీ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

గబ్బర్ సెంచరీ..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58), అంబటి రాయుడు(25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 45 నాటౌట్) రాణించారు. అనంతరం ధావన్ అజేయ సెంచరీతో ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నుందకుంది. చెన్నై బౌలర్లలో చహర్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్, ఠాకుర్, బ్రావో చెరొక వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. 7 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంది. మరోవైపు చెన్నై మాత్రం.. 6 ఓటమితో ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
రాహుల్ తెవాటియా పట్టిందల్లా బంగారమే.. చాన్స్ ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా కనుగొంటాడు: సెహ్వాగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications