గొప్ప బ్యాట్స్మన్ను చూడలేకపోయాం..
‘ధోనీ కెప్టెన్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఓ అద్భుత బ్యాట్స్మన్ను చూడలేకపోయింది. అతను భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. నెంబర్ 3లో బ్యాటింగ్ చేసుంటే కనుక ఈ క్రికెట్ ప్రపంచం.. ధోనీలోని ఓ భిన్నమైన ఆటగాడిని చూసేది. అతను కూడా మరిన్ని పరుగులు చేసేవాడు. ఎన్నో రికార్డులు బద్దలయ్యేవి. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా నిలిచేవాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుత క్రికెట్లో నాణ్యత లేదు..
నాణ్యమైన బౌలర్లున్న కాలంలోనే ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి పరుగుల మోత మోగించాడని, ఇప్పుడైతే ప్రపంచ రికార్డులు సృష్టించేవాడని గంభీర్ జోస్యం చెప్పాడు. ‘ధోనీ ఫ్లాట్ వికెట్పైనే మూడో స్తానంలో బ్యాటింగ్కు దిగి నాణ్యమైన బౌలర్లను చెడుగుడాడాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పరుగుల సునామీ సృష్టించాడు. ఇప్పటి క్రికెట్లో అంతటి నాణ్యమైన బౌలర్లు లేరు. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు పూర్తిగా బలహీనమయ్యాయి. దీంతో ప్రస్తుత క్రికెట్లో నాణ్యత లోపించింది. ఈ పరిస్థితుల్లో ధోనీ మూడో స్థానంలో ఆడుంటే పరుగుల మోత మోగించేవాడు.'అని ఈ మాజీ ఓపెనర్ చెప్పాడు.
ధోనీ కూడా మూడో స్థానంతోనే..
ఇక గంభీర్ చెప్పినట్లు ధోనీ కూడా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 2004లో బంగ్లాదేశ్పై అరంగేట్రం చేసిన ధోనీ ఆరంభంలో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసి విఫలమయ్యాడు. 2005లో విశాఖ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా మూడో స్థానంలో బరిలోకి దిగి తన విధ్వంసకర బ్యాటింగ్తో పాక్ బౌలర్లకు చుక్కుల చూపించాడు. అద్భుత సెంచరీ(148)తో యావత్ క్రికెట్ ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటాడు. అనంతరం శ్రీలంకపై మరోసారి మూడో స్థానంలోనే బరిలోకి తానెంతటి విధ్వంసకర ఆటగాడినో తెలియజెప్పాడు.
మూడో స్థానంలో 16 వన్డేలే..
16 వన్డేల్లో నెంబర్ 3లో బ్యాటింగ్ చేసిన ధోనీ.. 82 సగటుతో 993 పరుగులు చేశాడు. ఎక్కువ శాతం ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి ఫినిషర్ పాత్ర పోషించిన ఈ జార్ఖండ్ డైనమైట్.. 10,773 రన్స్ చేశాడు. ఇక గతేడాది వన్డే ప్రపంచకప్ అనంతరం ఆటకు దూరమైన మహీ.. ఐపీఎల్తో పునరాగమనం చేయాలని భావించాడు. కానీ కరోనా గత్తర పుణ్యమా.. ఈ క్యాష్ రిచ్ లీగ్ రద్దవ్వడంతో అతని భవితవ్యంపై గందరగోళం నెలకొంది. అయితే టీ20 ప్రపంచకప్ ఆడిన తర్వాతే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు.