తన ఆధీనంలో ఉండాలని..
‘2007లో తొలిసారి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన ధోనీ అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. జట్టు సమావేశాలు కూడా 5 నిమిషాల్లోనే పూర్తయ్యేవి. 2007 నుంచీ 2013 వరకు ఎప్పుడైనా అంతే. అయితే, ధోనీ కెప్టెన్ అయిన ప్రారంభంలో ప్రతీ ఒక్కర్నీ అదుపులో ఉంచేందుకు పరితపించేవాడు. వికెట్ కీపింగ్ నుంచీ బౌలింగ్ విషయాల వరకు అన్నీ తన ఆధీనంలో ఉండాలనుకునేవాడు. కానీ, 2013కు వచ్చేసరికి బౌలర్లకు స్వేచ్ఛనిచ్చాడు.
అనుభవంతో నమ్మకం ఉంచాడు..
అతడు నియంత్రించడం కాకుండా బౌలర్లే స్వీయ నియంత్రణలో ఉండేలా వదిలేశాడు. ఆరేళ్లలో అనుభవపూర్వకంగా స్లో బౌలర్లు, స్పిన్నర్లపై విశ్వాసం పెంచుకున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి వచ్చేసరికి పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కీలకమైన సమయాల్లో స్పిన్నర్లను బరిలోకి దింపి వికెట్లు సాధించి మ్యాచ్లు గెలిచేలా వ్యవహరించాడు' అని పఠాన్ తెలిపాడు.
ఏకైక కెప్టెన్..
ఇక ధోనీ సారథ్యంలోని భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. అలా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్గా మహీ చరిత్ర సృష్టించాడు. ఇర్ఫాన్ పఠాన్ సైతం 2011 ప్రపంచకప్ మినహా మిగతా రెండు ఐసీసీ టోర్నీల్లో పాలుపంచుకున్నాడు. ఇక 2013 చాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ మరో ఐసీసీ టోర్నీ గెలవలేదు.
భవితవ్యం ప్రశ్నార్థకం..
మరోవైపు ధోనీ గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడని చూసినా కరోనా పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. మళ్లీ ఆ మెగా టోర్నీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు. దీంతో ధోనీ భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.