
వాటే కోఇన్సిడెన్స్..
ఇక కాకతాళీయమో లేక నటరాజన్ అదృష్టమో కానీ.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరహాలోనే ఈ సన్రైజర్స్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బుమ్రా, నట్టూ మధ్య ఉన్న ఈ ఆసక్తికరమైన పోలికను సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బుమ్రా తరహాలోనే నట్టూ టీ20, వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టాడన్నాడు. నాలుగేళ్ల క్రితం ఇదే ఆసీస్ గడ్డపై బుమ్రా టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడని, అతను కూడా అరంగేట్ర వన్డేలో రెండు వికెట్లు తీశాడని చెప్పాడు. ఆ మ్యాచ్లో భారత్ గెలిచిందని, అది కూడా ఇప్పటిలా ఓదార్పు విజయమేనని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు.

వారెవ్వా.. ఇద్దరూ ఒకలానే
‘జస్ప్రీత్ బుమ్రా, నటరాజన్ మధ్య చోటు చేసుకున్న ఈ కోఇన్సిడెన్స్ అద్భుతం. ఈ ఇద్దరూ ఆటగాళ్లు జట్టులోని మరో ప్లేయర్ గాయపడటంతోనే అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా గడ్డపైనే టీ20, వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా వన్డే సిరీస్లోని ఆఖరి మ్యాచ్లోనే అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. పైగా రెండు సందర్భాల్లోనూ అంతకుముందు ఓడిన భారత్ వీరు ఆడిన మ్యాచ్ల్లో గెలిచింది. అరంగేట్ర టీ20 మ్యాచ్ల్లోనూ ఇద్దరూ మూడు వికెట్లు తీశారు. నట్టూ బుమ్రాలానే ప్రభావవంతమైన బౌలింగ్ను కొనసాగిస్తే భారత జట్టుకు తిరుగుండదు.'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఔను కదా..!
ఇక సెహ్వాగ్ చెప్పిన ఈ ఆసక్తికర విషయాలను చూసి అభిమానులు కూడా అవును కదా!అని అవాక్కవుతున్నారు. నట్టూకి మంచి భవిష్యత్తు ఉందని, అతను బుమ్రాను మించిపోతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టీఎన్పీఎల్లో అదరగొట్టిన నట్టూను సెహ్వాగ్.. రూ.3 కోట్ల భారీ ధరకు 2017లో కింగ్స్ పంజాబ్ జట్టుకు తీసుకున్నాడు.
కనీసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడని నటరాజన్ను ఎందుకు తీసుకున్నాడని, అంత ధర అవసరమా? అని విమర్శకులు సెహ్వాగ్ను తప్పుబట్టారు. ఆ సీజన్లో నట్టూ కూడా విఫలమయ్యాడు. 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో పంజాబ్ నట్టూను వదిలేసింది. అయితే టీఎన్పీఎల్లో అతని ప్రతిభను గమనించిన సన్రైజర్స్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్ 2018 వేలంలో రూ.40 లక్షలకు హైదరాబాద్ కొనుగోలు చేసేలా కృషిచేశాడు. పూర్తిగా బౌలర్లతో ఉండే హైదరాబాద్లో అతనికి అవకాశాలు రాలేదు. 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టి హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

యార్కర్ల నట్టూ..
ఐపీఎల్ 2020 సీజన్లో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 8.02 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్ సాధ్యం కానీ విధంగా ఈ సీజన్లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే తన పేరును యార్కర్ల నట్టూగా మార్చుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 2లో కూడా చివరి ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేసి ప్రత్యర్థి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. నట్టూ బౌలింగ్కు యువరాజ్ సింగ్, హర్షాబోగ్లే సైతం ఫిదా అయ్యారు. ఇంతగా రాణించిన అతనికి భారత జట్టులోకి నేరుగా అవకాశం దక్కలేదు. ఫస్ట్ నెట్ బౌలర్గా.. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో టీ20లకు.. సైనీ గాయంతో వన్డేలో బ్యాకప్గా అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ల్లోనే వికెట్లు తీసి.. జట్టులో కీలక బౌలర్గా నిలిచాడు.
India vs Australia, 2nd T20: జోరు మీద కోహ్లీ సేన.. గాయాలతో ఆస్ట్రేలియా!


Click it and Unblock the Notifications












