
రోహిత్ మార్క్ కెప్టెన్సీ..
ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ స్వల్పంగా గాయపడ్డాడు. ఫిజియోల సూచనమేరకు ముందు జాగ్రత్తగా మైదానం వీడాడు. దాంతో.. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. 17వ ఓవర్ నుంచి తన బుర్రకి పదునుపెట్టాడు. ఇంగ్లండ్ విజయానికి చివరి 24 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో రోహిత్ శర్మ బౌలర్లను వినియోగించిన తీరు, ఫీల్డర్ల మార్పు మెరుగైన ఫలితాల్ని ఇచ్చింది. అప్పటి వరకూ ప్రమాదకరంగా కనిపించిన బెన్స్టోక్స్, ఇయాన్ మోర్గాన్లను కట్టడి చేసేందుకు శార్ధూల్ ఠాకూర్కి బంతినివ్వగా.. అతను వరుసగా రెండు బంతుల్లో ఆ ఇద్దరినీ ఔట్ చేశాడు.

బౌలర్లను వాడుకున్న తీరు..
ఆ తర్వాత ఓవర్ను హార్దిక్ పాండ్యాతో వేయించిన రోహిత్.. కీలకమైన 19వ ఓవర్లో భువనేశ్వర్ను రంగంలోకి దింపాడు. ఇక చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 23 పరుగులు కావాల్సిన సమయంలో మళ్లీ ఠాకూర్ను బౌలింగ్కి దింపిన రోహిత్.. అతను కొన్ని పరుగులిచ్చినా.. సలహాలు, సూచనలు చేస్తూ అతనిలో స్థైర్యాన్ని నింపాడు. వరుస బౌండరీలతో ఆర్చర్ చెలరేగగా.. వైడ్లతో శార్దూల్ టెన్షన్ పెట్టాడు. కానీ రోహిత్, పాండ్యా సూచనలతో ఒత్తిడిని అధిగమించిన అతను చివరి మూడు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది. దాంతో.. కెప్టెన్గా రోహిత్ శర్మకు మంచి మార్కులు పడ్డాయి.

రోహిత్ కెప్టెన్సీ సూపరో సూపర్..
కామెంటేటర్లు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీని కొనియాడారు. కీలక సమయంలో రోహిత్ జట్టు పగ్గాలు అందుకోవడం భారత్కు కలిసొచ్చిందని, అతని సారథ్య నైపుణ్యాలు అద్భుతమని కొనియాడారు. పరిస్థితులకు తగ్గట్లు కెప్టెన్సీ చేయడంలో రోహిత్కు సాటిలేరని, అందుకే అతను ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గారని కొనియాడారు. ఇక రోహిత్ శర్మ అభిమానులు కూడా ఇదే విషయాన్ని పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఉంటే మ్యాచ్ కచ్చితంగా ఓడిపోయేదని, బౌలర్ల కన్నా ముందే అతను ఒత్తిడికి లోనయ్యేవాడని కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

చిన్న గాయమే..
మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నా తాను డగౌట్లో కూర్చుని ఉండటానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీవెల్లడించాడు. 'ఫీల్డింగ్ సమయంలో బంతిని వెంటాడుతూ వెళ్లి.. వేగంగా త్రో చేశాను. దాంతో కాలు కొద్దిగా బెణికినట్లు అనిపించింది. ఆ సమయంలో అలానే ఫీల్డింగ్ కొనసాగిస్తే.. గాయపడే ప్రమాదం ఉన్నందున మైదానం వీడాను. శనివారం చివరి టీ20 మ్యాచ్ ఉండటంతో.. మైదానం వెలుపలికి వెళ్లడమే సరైన నిర్ణయమని అప్పుడు నేను భావించా'అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఐదు టీ20ల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవగా.. కీలక డిసైడర్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగానే శనివారం జరగనుంది.
తెలియనప్పుడు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఎలా ఔట్ ఇస్తాడు: విరాట్ కోహ్లీ


Click it and Unblock the Notifications
