
ఇంతకేం జరిగిందంటే..?
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్ చివరి బంతి కీరన్ పొలార్డ్ ప్యాడ్కు తగిలింది. దీంతో పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. వెంటనే పొలార్డ్ రివ్యూకు వెళ్లగా.. బంతి బ్యాట్ను తాకుతూ ప్యాడ్ను తాకిందని రిప్లేలో స్పష్టమైంది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అప్పటికే పొలార్డ్ సింగిల్ తీసాడు. కానీ డీఆర్ఎస్ నిబంధనల ప్రకారం ఆ సింగిల్ కౌంట్ కాలేదు. అంపైర్ ఔటిచ్చాక రూల్స్ ప్రకారం ఆ బాల్ డెడ్ అయినట్లే ఆ తరువాత వచ్చిన పరుగులను లెక్కించరు. అయితే ఇదెక్కడి నిర్ణయమని ఆకాశ్ చోప్రా ప్రశ్నిస్తున్నాడు. అంపైర్ తప్పిదం చేస్తే బ్యాట్స్మెన్ ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.

కొంచెం పునరాలోచించండి..
ఈ నిబంధన కారణంగా ప్రపంచకప్లో ఏదో జట్టు మూల్యం చెల్లించుకుంటుందని, అప్పుడు కానీ ఈ నిబంధనలో ఉన్న లోపం తెలియదని ఆకాశ్ చోప్రా ఐసీసీని హెచ్చరించాడు. ‘పొలార్డ్, ముంబై ఇండియన్స్ సింగిల్ను స్వీకరించలేదు. ఎల్బీడబ్ల్యూ ఇచ్చారు. ఇన్సైడ్ ఎడ్జ్ అయినట్లు రిప్లేలో స్పష్టమైంది. ఇంతవరకు బాగుంది. కానీ సులువైన సింగిల్ కౌంట్ కాలేదు. డియర్ ఐసీసీ ప్రపంచకప్లో ఎవరో ఒకరు ఈ నిబంధనతో నష్టపోతారు. దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. బాల్ డెడ్ అయ్యేవరకు అంపైర్లు తమ నిర్ణయాన్ని రిజర్వ్ చేయాలి.'అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.

ఇది బ్యాటింగ్ టీమ్కు అన్యాయం..?
అయితే ఈ నిబంధనతో బ్యాటింగ్ టీమ్కు అన్యాయం జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మ్యాచ్ పరిస్థితులు సాధారణంగా ఉంటే పెద్దగా పట్టించుకోరని, కానీ గెలుపు ముంగిట ఇలాంటివి జరిగితే తీవ్ర దుమారం రేగుతుందని హెచ్చిరిస్తున్నారు. గతేడాది ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను ఉదహారణగా పేర్కొంటున్నారు.
ఆ ఫైనల్ మ్యాచ్లో చెన్నై విజయానికి చివరి బంతికి రెండు పరుగులు కావాలని, కానీ షార్దుల్ ఠాకుర్ ఎల్బీగా వెనుదిరిగడంతో ముంబై 1 పరుగుతో గెలిచిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఠాకుర్ సమీక్షకు వెళ్లి సక్సెస్ సాధిస్తే.. అప్పటికే పరుగు తీసుంటే పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం రన్ కౌంట్ కాదు. సమీక్షలో నాటౌట్గా తెలుతుంది. అయినా చెన్నై 1 పరుగుతో ఓడుతుంది. ఇది వినడానికే ఎంత నిష్పక్షపాతంగా ఉందని, జరిగితే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. బౌండరీ కౌంట్ నిబంధన కూడా ఈ తరహా విమర్శల నేపథ్యంలోనే మార్చారని గుర్తు చేస్తున్నారు.

పొలార్డ్, పాండ్యా విధ్వంసం..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) ధాటిగా ఆడగా... పొలార్డ్ (20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 నాటౌట్), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30 నాటౌట్) విరుచుకుపడ్డారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మినహా అంతా విఫలమయ్యారు.
పంజాబ్ టీమ్ కొంప కొల్లేరు చేసిన కర్ణాటక ప్రాంతీయ అభిమానం? కోచ్, కేప్టెన్: కన్నడ ప్లేయర్లపై


Click it and Unblock the Notifications












