భారత ఆటగాళ్లతోనే ఐపీఎల్..
ఈ నేపథ్యంలో వీదేశీ ఆటగాళ్లు లేకుండా కేవలం భారత ఆటగాళ్లతో ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే ఈ ప్రతిపాదనపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సీఈఓ ధీరజ్ మల్హోత్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఐడియాను ముందుకు తీసుకువచ్చాడు. అయితే దీనికి కొందరు అంగీకరిస్తుండగా.. మరికొందరు తీసిపారేస్తున్నారు.
వ్యతిరేకించిన చెన్నై..
ఈ ఆలోచనను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) వ్యతిరేకించింది. అలా నిర్వహిస్తే అది ఐపీఎల్ ఎందుకవుతుందని, ముస్తాక్ అలీ(దేశవాళీ టీ20 పోటీలు) ట్రోఫీలా ఉంటుందని ఆ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "కేవలం భారత ప్లేయర్లతోనే ఐపీఎల్ నిర్వహించే విషయంపై సీఎస్కే ఆసక్తిగాలేదు. మరో ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడినట్టు ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితులు తీవ్రంగానే ఉన్న కారణంగా బీసీసీఐతో ఫ్రాంచైజీ ఏమీ మాట్లాడలేదు. ఈ ఏడాది చివర్లో ఐపీఎల్ జరుగుతందని మనం ఆశించొచ్చు" అని ఆ అధికారి చెప్పారు.
రాయల్స్కు ఓకే..
అయితే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ ఐడియాకు అంగీకరించినట్లు మల్హోత్ర తెలిపారు. మరిన్నీ ఫ్రాంచైజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఐడియాను భారత మాజీ ఓపెనర్, రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న గౌతం గంభీర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
మరోవైపు షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ జరుగకుంటే ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య ఐపీఎల్ను నిర్వహించే అవకాశాలున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.
తుది నిర్ణయం తీసుకోని బీసీసీఐ..
బీసీసీఐ మాత్రం ఐపీఎల్ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ జరుగకుంటే బీసీసీఐ సైతం ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే బోర్డు రూ.4వేల కోట్లకు పైగా నష్టపోతుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు.
అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్