ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న జెండా వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పందించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరును తప్పుబట్టింది. మిగతా జట్ల తరహాలోనే భారత జెండాను కూడా ఎగరవేయాలని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా డిమాండ్ చేశారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న దేశాల జెండాలను కరాచీ స్టేడియంతో పాటు లాహోర్లోని గడాఫీ స్టేడియం పైకప్పుపై ఎగరవేసిన పీసీబీ.. భారత త్రివర్ణ పతకాన్ని మాత్రం విస్మరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పీసీబీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ తన నీచ బుద్దిని బయటపెట్టుకుందని మండిపడ్డారు.

పాక్లో పర్యటించనప్పుడు జెండా ఎందుకు?
ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించకపోవడంతోనే పీసీబీ జెండాను ఎగరవేయలేదని ఆ దేశ నెటిజన్లు, జర్నలిస్ట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పీసీబీ కూడా స్పందించింది. 'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు పాకిస్థాన్కు భారత్ రావట్లేదు. కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడుతున్న జట్ల జెండాలను మాత్రమే ఎగరవేశాం.
భారత్ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది. బంగ్లాదేశ్ కూడా ఇంకా పాకిస్థాన్కు రాలేదు. ఆ జట్టు తమ తొలి మ్యాచ్ను భారత్తో ఆడనుంది. కాబట్టి భారత్, బంగ్లాదేశ్ జెండాలను ఇంకా ఎగరవేయలేదు. పాకిస్థాన్కు వచ్చిన మిగతా జట్ల జాతీయ పతకాలను మాత్రమే ఎగరవేసాం. ఈ జెండాల గురించి పీసీబీ అధికారికంగా స్పందించాల్సిన అవసరం లేదు.'అని ఆ బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి.
జెండా పెట్టాల్సిందే..
ఈ వ్యవహారంపై తాజాగా ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడిన రాజీవ్ శుక్లా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుబట్టారు. 'ముందుగా అక్కడ భారత జెండా ఉందో లేదో నిర్దారించుకోవాలి. ఒకవేళ లేకుంటే మాత్రం భారత జెండా పెట్టాల్సిందే. ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ పతకాలను ఎగరవేయాలి.'అని రాజీవ్ శుక్లా తెలిపారు.
ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ పాకిస్థాన్లో పర్యటించేందుకు బీసీసీఐ అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా పీసీబీని ఐసీసీ ఒప్పించింది. ఇందుకుగానూ బీసీసీఐ-పీసీబీల మధ్య ఓ ఒప్పందం జరిగింది. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని పీసీబీ కోరగా.. అందుకు బీసీసీఐ అంగీకరించింది. అంతేకాకుండా నష్టపరిహారంగా పీసీబీకి ఐసీసీ.. ఓ మెగా టోర్నీని కూడా కేటాయించింది. టోర్నీ నిర్వహణ బడ్జెట్ కూడా పెంచింది. దాంతో భారత్ మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది. బుధవారమే ఈ టోర్నీకి తెరలేవనుంది.
Champions Trophy 2025: మా జట్టుకు అంత సీన్ లేదు: పాక్ మాజీ క్రికెటర్