ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు అత్యంత ప్రమాదకరమని మాజీ క్రికెటర్లు ఇతర జట్లను హెచ్చరిస్తూ ఉంటే.. ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ మాత్రం తమ టీమ్కు అంత సీన్ లేదన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని తమ జట్టు గెలవడం చాలా కష్టమని, అసలు ఆ అర్హతే లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ ఇప్పుడే మళ్లీ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 19న పాక్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది. సొంతగడ్డపై ఈ టోర్నీ జరుగుతుండటం పాకిస్థాన్కు అడ్వాంటేజ్ అని, ఆ జట్టు టైటిల్ రేసులో ఉంటుందని ఇతర దేశాల మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తుంటే.. కమ్రాన్ అక్మల్ మాత్రం తనకు నమ్మకం లేదని చెప్పాడు.

'యావత్ దేశం గర్వపడే క్షణాలు ఇవే. మేం చివరిసారిగా 1996 వన్డే ప్రపంచకప్కు నిర్వహించాం. ఇప్పుడు మళ్లీ అవకాశం లభించింది. ఈ టోర్నీని సక్సెస్ఫుల్గా ముగిస్తే భవిష్యత్తులో మాకు మరిన్ని ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది. టోర్నీ ముగిసేటప్పుడు ప్రతీ జట్టును మా ఆతిథ్యం గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఈ టోర్నీ కోసం గత నాలుగైదు నెలలుగా మేం బాగా కష్టపడ్డాం. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగలదా? అనే చర్చ కూడా జరిగింది. ఈ పరిస్థితులన్నింటినీ దాటుకొని టోర్నీ ప్రారంభానికి రంగం సిద్దమైంది. భారత్.. పాక్లో పర్యటించనుందుకు బాధగానే ఉంది.
అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక విషయాలు చాలా సున్నితమైనవి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారని ఇప్పుడే చెప్పలేం. అయితే పాకిస్థాన్ జట్టుకు మాత్రం అవకాశాలు తక్కువే. జట్టులో చాలా లోపాలు, బలహీనతలు ఉన్నాయి. బౌలింగ్లో ఇబ్బందులు ఉండటంతో పాటు నాణ్యమైన స్పిన్నర్లు లేరు. బ్యాటింగ్లోనూ సమస్యలు ఉన్నాయి. ఇంకాస్త మెరుగైన జట్టును ఎంపిక చేయాల్సింది. నా అంచనా ప్రకారం భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు వస్తాయని భావిస్తున్నా. పాకిస్థాన్ సెమీస్ చేరితేనే గొప్ప ఘనత. టైటిల్ గెలిచే అర్హత మాత్రం లేదు.'అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.