‘వీరూ కా బైతక్'షో వల్లనే..
ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేసిన ఓ ఫొటోకు కామెంట్ చేసిన దాదా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ సందర్భంగా సెహ్వాగ్ నిర్వహించిన వీరూ కా బైతక్ షో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిందని తెలుపుతూ మాజీ డాషింగ్ ఓపెనర్ను కొనియాడాడు. తనకు సంబంధించిన ఓ స్టైలిష్ ఫోజ్ ఫొటోను సెహ్వాగ్ ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘ఎడమ వైపు ఏది వెళ్లకపోతే మీరు కుడివైపు కి వెళ్లండి'అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన దాదా.. ‘అరే ఏం చెప్పినవ్ సెహ్వాగ్... మస్త్ చెప్పినవ్ పో.. నువ్వు చూడ్డానికి ఫిట్గా అందంగా ఉన్నావ్... ఐపీఎల్ 2020 సీజన్ అత్యధిక ప్రేక్షకాదరణ అందుకోవడానికి నువ్వు నిర్వహించిన వీరూ కా బైతక్ షో ఒక కారణం'అని కామెంట్ చేశాడు. దీనికి సెహ్వాగ్ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘దాదా నువ్వు.. జైషా లేకుంటే ఐపీఎల్ 2020 సీజన్ సాధ్యమయ్యేదే కాదు'అని పేర్కొన్నాడు.
సెహ్వాగ్ హల్చల్..
ఐపీఎల్ మ్యాచ్లను సెహ్వాగ్ ‘వీరూ కీ బైతక్'అనే కార్యక్రమంలో విశ్లేషించిన సంగతి తెలిసిందే. ప్రతీ మ్యాచ్కు ముందు గెలుపోటములను అంచనా వేసిన వీరూ.. ఆటగాళ్ల ఆటతీరుపై ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ సిటీజన్స్ అని, రోహిత్ శర్మ, సౌరభ్ తివారీలను వడాపావ్, సమోసా పావ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించి అభిమానులతో చివాట్లు కూడా తిన్నాడు. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా విదేశీ ఆటగాళ్ల ఆటతీరుపై సెటైర్లు పేల్చాడు. మ్యాక్స్ వెల్ రూ.10 కోట్ల ఖరీదైన చీర్ లీడర్ అంటూ విమర్శించాడు. తనదైన కామెంట్స్తో ఐపీఎల్ జరుగుతున్నంత సేపు సెహ్వాగ్ వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్@1
బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. ఐపీఎల్ 2020 సీజన్ టీవీ వ్యూవర్షిప్ గత ఏడాదితో పోలిస్తే ఊహించని విధంగా పెరిగింది. ఐపీఎల్ 2019 సీజన్కి 27.3 మిలియన్ యావరేజ్ ఇప్రెషన్స్రాగా.. ఐపీఎల్ 2020 సీజన్కి ఏకంగా 31.57 మిలియన్ యావరేజ్ ఇప్రెషన్స్ వచ్చాయి. ఇక గత ఏడాది 462 మిలియన్ వ్యూవర్షిప్ నమోదవగా.. ఈ ఏడాది 23 శాతం వీక్షణ పెరిగినట్లు తెలుస్తోంది. అత్యధిక టీవీ వ్యూవర్షిప్ సంపాదించిన తొలి స్పోర్ట్స్ టోర్నమెంట్గా ఐపీఎల్ నిలించింది.
ఐపీఎల్ 2020 సీజన్ వ్యూవర్షిప్ పెరిగేందుకు స్థానిక భాషల్లో టోర్నీని ప్రసారం కూడా దోహపడింది. ఇంగ్లీష్తో పాటు టోర్నీ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్.. హిందీ, బెంగాళి, తెలుగు, తమిళ్, కన్నడ భాషాల్లో టోర్నీని ప్రసారం చేసింది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని చాలా మంది ఇంటి దగ్గర ఉండటం, మ్యాచ్ టైమింగ్స్నీ అరగంట ముందుకు జరపడం కలిసొచ్చింది.