|
డిసెంబర్ 3 నుంచి..
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3 నుంచి బిగ్బాష్ లీగ్ ప్రారంభంకానుండగా.. గతేడాదితో పోలిస్తే 14 రోజులు ముందే ఈ టోర్నీ ప్రారంభంకానుంది. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కరోనా వైరస్ నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేసింది. ఒకవేళ టీ20 వరల్డ్కప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐసీసీ ప్రకటించే ఆ టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయం కోసం గత మూడు నెలలుగా ఎదురుచూస్తోంది. కానీ.. బీసీసీఐని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ విషయంపై ఎటు తేల్చకుండా మరింత నాన్చుతుంది.
సీపీఎల్ షెడ్యూల్ కూడా..
ఐపీఎల్ షెడ్యూల్పై ఒకవైపు బీసీసీఐ ఆందోళన పడుతుండగా.. మరోవైపు వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తాము నిర్వహించే టీ20 లీగ్స్ షెడ్యూల్స్ని రోజుల వ్యవధిలోనే ప్రకటించేశాయి. రెండు రోజుల క్రితం విండీస్ బోర్డు తమ దేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించగా.. తాజాగా బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) డిసెంబరు 3 నుంచి స్టార్ట్ అవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.
బీసీసీఐకి మరో చిక్కు..
ఈ రెండు దేశాల టోర్నీల నేపథ్యంలో బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. ఈ రెండు టోర్నీలు.. ఐపీఎల్తో క్లాష్ కాకుండా బీసీసీఐ షెడ్యూల్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటిస్తే బీసీసీఐ మరింత ఇరకాటంలో పడుతుంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలో కొన్ని పీఎస్ఎల్ మ్యాచ్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే పీఎస్ఎల్ను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని ఇప్పటికే పీసీబీకి స్పష్టం చేసింది.
భారత పర్యటనతో క్లాష్
ఇక బిగ్బాష్ లీగ్ ప్రారంభమయ్యే రోజే.. భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్కడే టెస్టు సిరీస్ కూడా ప్రారంభంకానుంది. డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ ఈ రెండు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరిగేలా ఇటీవల షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్తో పాటు ఇతర ఆటగాళ్లు బిగ్బాష్ లీగ్ ఆరంభ మ్యాచ్లకి దూరం కానున్నారు.