
హైదరాబాద్: స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలతో సహా వివిధ రాష్ర్టాల సీఎంలు, క్రీడాకారులు ఇప్పటికే సోషల్ మీడియాలో సింధుకు అభినందనలు తెలిపారు.
మాటలు చాలడం లేదు.. ఈ విజయం అమ్మకు అంకితం: సింధు
తాజాగా సింధు చిరకాల ప్రత్యర్థి స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ సైతం సింధు విజయంపై ట్విట్టర్లో 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు బంగారానివి సింధు' అంటూ ట్వీట్ చేసింది. 2016 రియో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ ఫైనల్స్లో వీరిద్దరూ తలపడ్డారు.
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్లో మారిన్ స్వర్ణ పతకం గెలవగా.. పీవీ సింధు రజతాన్ని కైవసం చేసుకుంది. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. మరోవైపు సింధు విజయంపై స్నూకర్ ప్రపంచ ఛాంపియన్ పంకజ్ ఆడ్వాణీ కూడా ట్వీట్ చేశాడు.
స్టోక్స్ను ఆకాశానికెత్తిన ఇంగ్లీషు మీడియా: అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియా
"బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినందుకు శుభాకాంక్షలు సింధు. చాలా అద్భుతమైన పోరాటం చేశావు" అంటూ ట్వీట్ చేశాడు. ఆదివారం జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. ఫలితంగా ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ... 'ప్రస్తుతం చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా. సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు మాటలు చాలడం లేదు. గత రెండు సంవత్సరాలు రజతమే దక్కింది. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలనుకున్నా. ఆర్నెల్లుగా కష్టపడ్డా. ప్రతిఫలం లభించింది. భారత్కు తొలి స్వర్ణం అందించడం గర్వకారణంగా ఉంది' అని సింధు అన్నారు.