ఓకే అన్న బాయ్..
తమ నిర్ణయాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) కూడా అంగీకరించిందని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ప్రపంచమంతటా పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్న నేపథ్యంలో రీషెడ్యూల్ చేసిన మిగతా టోర్నీల వివరాలను సందర్భానుసారం ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్ సెక్రటరీ థామస్ లాండ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందించారు. లాక్డౌన్ ఇంకా అమల్లో ఉన్న తెలంగాణలో ఆగస్టులో హైదరాబాద్ ఓపెన్ నిర్వహించడం నిజంగానే కష్టమయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు.
మంచి పని చేశారు..
‘ప్రస్తుతానికి హైదరాబాద్ ఇంకా లాక్డౌన్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఇక్కడ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఓపెన్ చేసే విషయంపై తెలంగాణ గవర్నమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అనుమతి కోసం మేం ఎదురు చూస్తున్నాం. అందువల్ల ఆగస్టులో టోర్నీకి కమిట్ అవడం మాకు చాలా కష్టమైన విషయం'అని గోపిచంద్ అభిప్రాయపడ్డారు.
ప్రాక్టీస్లో అశ్విని, లక్ష్యసేన్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప, యువ ఆటగాడు లక్ష్యసేన్తో మరో 20 మంది షట్లర్లు రెండు నెలల తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టారు. బెంగళూరులోని ప్రకాశ్ పదుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) వేదికగా కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో వీరందరూ ప్రాక్టీస్ను ప్రారంభించారు. ప్రస్తుతం 20 మంది షట్లర్లు ప్రాక్టీస్కు హాజరవుతున్నట్లు విమల్ కుమార్ తెలిపారు. అకాడమీలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ సమర్థంగా అమలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన... పరిశుభ్రత విషయంలో ఆటగాళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరినట్లు పేర్కొన్నాడు.