
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన విజయాన్నందుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డాబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై గెలుపొందింది.
గంటా 41 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్లు సంధించింది. ఇక రెండో రౌండ్లో డోడిగ్ (క్రొయేషియా)-లటీషా చాన్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి సానియా-పావిచ్ (క్రొయేషి యా) జంటకు వాకోవర్లభించిన విషయం తెలిసిందే.
వరుసగా నాలుగోసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించే దిశగా టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6-2, 4-6, 6-1, 6-2తో టిమ్ వాన్ రితోవెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు.
ఆరుసార్లు వింబుల్డన్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఏడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్ నిక్ కిరియోస్ 4-6, 6-4, 7-6 (7/2), 3-6, 6-2తో నకషిమా (అమెరికా)పై నెగ్గి 2014 తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6-3, 6-1, 6-4తో కుబ్లెర్ (ఆస్ట్రేలియా)పై, క్రిస్టియన్ గారిన్ (చిలీ) 2-6, 5-7, 7-6 (7/3), 6-4, 7-6 (10-6)తో డిమినార్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తొలిసారి తమ కెరీర్లో ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు అర్హత పొందారు.
మహిళల సింగిల్స్లో మాజీ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిసియా), రిబాకినా (కజకిస్తాన్), అని సిమోవా (అమెరికా), తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలి యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.