
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా శుభారంభం చేసింది. నాలుగేళ్ల తర్వాత వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. అమెరికా ప్లేయర్ బెతాని మ్యాటెక్ సాండ్స్తో కలిసి అద్భుత విజయాన్నందుకుంది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా- బెతానియా జోడీ 7-5, 6-3 తేడాతో ఆరో సీడ్ అలెక్సా గౌరచి(చీలియన్)- డిసారియ క్రాక్జిక్(అమెరికా) జోడీపై విజయం సాధించింది.
గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ వరుస సెట్లలో గెలుపొంది అలవోక విజయాన్నందుకుంది. సానియా కెరీర్లో ఇది 121 విజయం కాగా.. ఈ మ్యాచ్లో ఆమె ఒక్క ఏస్ సంధించింది. సానియా వింబుల్డన్లో 2017లో చివరిసారిగా బరిలోకి దిగింది.
ఒలింపిక్స్కు ముందు జరుగుతున్న ఈ మెగా టెన్నిస్ టోర్నీ సానియాకు చాలా కీలకం. 34 ఏళ్ల వయసులో కెరీర్ చివరి దశలో ఉన్న ఆమెకు వింబుల్డన్ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020తో భారత్ తరఫున నాలుగు ఒలింపిక్స్ల్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్గా సానియా మీర్జా నిలవనుంది.
2018లో ఇజాన్కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి సెకండ్ ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఈస్ట్బోర్న్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో తొలి రౌండ్లోనే సానియా జోడీ నిరాశపరిచింది.