లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్షిప్ ప్రైజ్మనీలో కోత పడింది. 2019లో జరిగిన చివరి టోర్నీలో ఇచ్చిన ప్రైజ్మనీలో 5.2 శాతం తగ్గిస్తున్నట్లు టోర్నీ నిర్వహాకులు బుధవారం ప్రకటించారు. ఈ నెల 28 నుంచి మొదలయ్యే టోర్నీకి ఈసారి రూ.362 కోట్లు(49.4 మిలియన్ డాలర్లు) ఇస్తున్నట్టు చెప్పారు. కోత కారణంగా సింగిల్స్ చాంపియన్స్ ఎక్కువగా నష్టపోనున్నారు.
2019 టోర్నీలో సింగిల్స్ విన్నర్లు రూ. 24.31 కోట్లు అందుకోగా.. ఈసారి 17.59 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంటారు. మొత్తం ప్రైజ్మనీ తగ్గినా క్వాలిఫయర్స్కు ఇచ్చే నగదు మాత్రం పెరిగింది. లాస్ట్ టైమ్తో పోలిస్తే వాళ్లకు ఇచ్చే మొత్తం ఈసారి 17.5 శాతం పెంచారు. ఇక, మెన్స్, విమెన్స్ సింగిల్స్ స్టేడియం ఫుల్ కెపాసిటీ అయిన 15 వేల మంది ఫ్యాన్స్ సమక్షంలో జరుగుతాయని ఆర్గనైజర్స్ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి టిక్కెట్ల అమ్మకం మొదలవుతుందని చెప్పారు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్, జపాన్ టెన్నిస్ నవోమి ఒసాక ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మానసిక ఆరోగ్యం సరిగా లేదని, మీడియా సమావేశాల్లో పాల్గొనలేనని ఫ్రెంచ్ ఒపెన్ 2021 టోర్నీ అర్ధంతరంగా తప్పుకున్న ఈ జపాన్ స్టార్.. వింబుల్డన్కు ముదు జరిగే బెర్లిన్ ఓపెన్ కూడా ఆడనని తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె వింబుల్డన్ టోర్నీలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.
ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్లో ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బోరా క్రెజికోవా చాంపియన్లుగా నిలిచిన విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-7(6/8),2-6,6-3,6-2,6-4 తో ఐదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్ (గ్రీస్)పై గెలుపొందాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్సీడెడ్ క్రెజికోవా 6-1, 2-6, 6-4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)ను ఓడించింది. డబుల్స్ విభాగంలో కూడా క్రెజికోవా చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో క్రెజికోవా -కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-4, 6-2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) -ఇగా స్వియాటెక్ (పోలాండ్) జోడీపై గెలిచింది.