
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కైవసం చేసుకున్నాడు. తద్వారా అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్(20) రికార్డును సమం చేశాడు. ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-7(4-7),6-4,6-4,6-3 తేడాతో ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటిని ఓడించాడు.
తొలి సెట్లో ఓడినా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో చెలరేగిన జొకో..వరుస సెట్లలో విజయం సాధించి చాంపియన్గా నిలిచాడు. హోరాహోరిగా సాగిన ఈ పోరులో జొకోవిచ్ 6 ఎస్లు సంధించి 4 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 6 బ్రేక్ పాయింట్స్ సాధించాడు. ఇక 16 ఎస్లతో 3 డబుల్ ఫాల్ట్స్ చేసిన బెరెటిని 2 బ్రేక్ పాయింట్స్ మాత్రమే సాధించాడు. కెరీర్లో జొకోవిచ్కు ఇది ఆరో వింబుల్డన్ టైటిల్.
'ఈ పోరు యుద్దం కంటే ఎక్కువ అన్నట్లుగా సాగింది. వింబుల్డన్ గెలవడం అనేది నా చిన్నప్పటి నుంచి ఉన్న అతిపెద్ద కల. ఈ విజయం ఎంత ప్రత్యేకమో నాకు తెలుసు. నా ఏడేళ్ల వయసు నుంచే సెర్బియాలోని నా బెడ్ రూమ్లో వింబుల్డన్ ట్రోఫీకి సంబంధించిన కలలు కన్నాను. ఈ రోజు ఆరు టైటిల్స్తో నిలబడ్డాను. నిజంగా ఇది అద్భుతం'అని విజయానంతరం జకోవిచ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక తన విజయంలో రఫెల్ నాధల్, రోజర్ ఫెదరర్ల పాత్ర ఎంతో ఉందని, తన ఆట మెరుగయ్యేందుకు వారు పరోక్షంగా కారణమయ్యారని జొకో చెప్పుకొచ్చాడు. వాళ్లకి తాను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. వారితో పోటీ పడటం వల్లనే తాను మెరుగుపరుచుకోవాల్సి విషయాలు తెలిసాయాని, 2010కి ముందు ఈ ఇద్దరి చేతిలో పెద్ద మ్యాచ్ల్లో ఓడిపోయానని గుర్తు చేసుకున్నాడు. 2010 చివర్లో తన దశ మారిందని, గత 10 ఏళ్లలో నమశక్యం కానీ ప్రయాణం సాగిందన్నాడు.
అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాళ్లలో జొకోవిచ్, రాఫెల్ నాథల్, రోజర్ ఫెడరర్ 20 టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పీట్ సంప్రాస్, రాయ్ ఎమర్సన్ 12 టైటిళ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.