ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025లో జపాన్ స్టార్ నవోమి ఒసాకా పోరాటం ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో సెమీఫైనల్ చేరిన ఒసాకా.. సెమీఫైనల్ ధాటలేకపోయింది. శుక్రవారమే జరిగిన రెండో సెమీఫైనల్లో అమెరికా స్టార్ అమాండా అనిసిమోవా 6-7 (4-7), 7-6 (7-3), 6-3 తేడాతో నవోమి ఒసాకాను ఓడించింది. రెండు గంటల 56 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఈ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. విజయం కోసం ఆఖరి వరకు శ్రమించారు.
తొలి సెట్లో ఒసాకా గెలిచి ఆధిక్యం సాధించింది. కానీ హోరాహోరీ సాగిన రెండో సెట్ను అనిసిమోవా టై-బ్రేక్లో గెలిచి మ్యాచ్ను మూడో సెట్కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక మూడో సెట్లో అనిసిమోవా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. రెండో సెట్లో అనిసిమోవా టై-బ్రేక్లో గెలవడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. మొదటి సెట్ ఓడిన తర్వాత.. అనిసిమోవా వెనుకంజలో నిలిచింది. కానీ, రెండో సెట్లో ఆమె చూపించిన పోరాట పటిమ, ముఖ్యంగా టై-బ్రేక్లో ఒసాకాను ఓడించడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. దాంతో మూడో సెట్లో ఆమె మరింత దూకుడుగా ఆడి మ్యాచ్ను గెలుచుకుంది.

ఈ మ్యాచ్లో ఒసాకా 15 ఏస్లు, 32 విన్నర్స్ కొట్టగా.. అమాండా అనిసిమోవా 7 ఏస్లతో పాటు 50 విన్నర్స్ నమోదు చేసింది. అమాండ అనిసిమోవా 36 అనవసర తప్పిదాలు చేస్తే ఒసాకా 22 తప్పిదాలు చేసింది. ఒసాక ఒక డబుల్ ఫాల్ట్ చేయగా.. అమండ అనిసిమోవా 7 డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఒసాకకు 11 బ్రేక్ పాయింట్ అవకాశాలు రాగా ఐదు గెలుచుకుంది. అమాండ మాత్రం 13 అవకాశాల్లో 6 బ్రేక్ పాయింట్స్ సాధించింది.
తొలి రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఒసాక.. కీలక మూడో సెట్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకాతో అమాండ తలపడనుంది. ఈ ఏడాది మహిళల సింగిల్స్లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను అమెరికా ప్లేయర్లే గెలుచుకోవడమే గమనార్హం. యూఎస్ ఓపెన్లోనూ అమెరికా ప్లేయర్ విజేతగా నిలుస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.