ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2024లో సెమీస్కు చేరి ఆశలు రేకెత్తించిన భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ తీవ్రంగా నిరాశపర్చింది. మంగళవారం అర్థరాత్రి జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో 8వ సీడ్ బోపన్న-అల్దిలా సుత్జిజాది(ఇండోనేషియా) ద్వయం 3-6, 4-6 తేడాతో అమెరికా జంట డొనాల్డ్ యంగ్-టేలర్ టౌన్సెండ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది.
ఈ పరాజయంతో రోహన్ బోపన్న పోరాటం ముగిసింది. ఇప్పటికే పురుషుల డబుల్స్లోనూ బోపన్న నిష్క్రమించాడు. సోమవారం జరిగిన క్వార్టర్స్లో 8వ సీడ్ బోపన్న-సుజియాది ద్వయం 7-6(7-4), 2-6, 10-7తో నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)-క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బోపన్న జోడీ.. ఆరు ఏస్లు 27 విన్నర్లు కొట్టింది.

మహిళల, పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్లు ముందంజ వేసారు. జానెక్ సినర్, ఇగా స్వియటెక్ క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టారు. నొవాక్ జొకోవిచ్, అల్కారజ్ నిష్క్రమణతో టైటిల్పై అంచనాలున్న వరల్డ్ నెంబర్వన్ సినర్ అతి కష్టం మీద ప్రీ క్వార్టర్స్ దాటాడు.
14వ సీడ్ టామీ పాల్తో జరిగిన పోరులో తొలి రెండు సెట్లను టైబ్రేకర్లో గెలుచుకున్న సినర్ చివరకు 7-6 (7/3), 7-6 (7/5), 6-1తో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. సెమీస్ బెర్త్ కోసం మాజీ విజేత డానిల్ మెద్వెదెవ్తో సినర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
5వ సీడ్ మెద్వెదెవ్ 6-0, 6-1, 6-3తో నూనో బోర్జ్సను ఓడించాడు. మరో మ్యాచ్లో 10వ సీడ్ అలెక్స్ డి మినార్ 6-0, 3-6, 6-3, 7-5తో జోర్డాన్ థాంప్సన్పై గెలిచాడు.
మహిళల సింగిల్స్లో ఆరో గ్రాండ్స్లామ్ వేటలో ఉన్న నెంబర్వన్ క్రీడాకారిణి స్వియటెక్ 6-4, 6-1తో 16వ సీడ్ లూడ్మిలా సామ్సనోవాను ఓడించి క్వార్టర్స్కు క్వాలిఫై అయ్యింది. క్వార్టర్స్లో 6వ సీడ్ జెస్సికా పెగులాతో తలపడనుంది. మరో ప్రీక్వార్టర్స్లో 22వ సీడ్ బెర్టెజ్ హద్దాద్ మియా 6-2, 3-6, 6-3తో వెటరన్ స్టార్ వోజ్నియాకిపై విజయం సాధించింది.