న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న ఫైనల్ చేరాడు. టెన్నిస్ చరిత్రలోనే ఓపెన్ ఎరాలో అత్యధిక వయసులో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్ చేరిన ప్లేయర్గా రికార్డుకెక్కాడు. 43 ఏళ్ల 6 నెలల వయసులో బోపన్న ఫైనల్ చేరడం విశేషం.
యూఎస్ ఓపెన్లో భాగంగా గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ఆరోసీడ్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) జోడీ 7-6(7/3), 6-2 తేడాతో పియారి హెర్బర్ట్స్-నికోలస్ మహుత్(ఫ్రాన్స్) ద్వయంపై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. దాంతో కెనడాకు చెందిన డానియెల్ నెస్టర్ రికార్డును బోపన్న అధిగమించాడు. 43 ఏళ్ల 4 నెలల వయసులో డానియెల్ నెస్టర్ ఫైనల్ చేరాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. బోపన్న బ్రేక్ చేశాడు.

ఓవరాల్ కెరీర్లో బోపన్న గ్రాండ్స్లామ్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2010లో తొలిసారి టైటిల్ ఫైట్కు అర్హత సాధించాడు. గంటా 34 నిమిషాల పాటు జరిగిన సెమీస్ పోరులో ఇండో-ఆసీస్ ద్వయం తమ సర్వీస్లతో హడలెత్తించింది. బలమైన గ్రౌండ్ స్టోక్స్తో పాటు క్రాస్ కోర్టు ర్యాలీలతో ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేసింది.
హోరాహోరీగా సాగిన తొలి గేమ్లో బోపన్న జోడీ ఏడు సెట్ పాయింట్లను కాపాడుకుంది. మ్యాచ్ మొత్తంలో బోపన్న జోడీ ఆరు ఎస్లు, నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఆరు బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని కాపాడుకొని 36 విన్నర్లతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. 14 అనవసర తప్పిదాలు చేసింది. ఫ్రాన్స్ జోడీ ఏడు డబుల్ ఫాల్ట్స్తో పాటు 19 విన్నర్లే సాధించడంతో ఓటమి తప్పలేదు.
అదరగొట్టిన అల్కరాజ్..:యూఎస్ ఓపెన్లో టాప్ సీడ్ అల్కరాజ్, నోవాక్ జకోవిచ్ సెమీఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో అల్కరాస్ 6-3, 6-2, 6-4 తేడాతో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. సెమీస్ పోరులో అల్కరాజ్, మెద్వెదేవ్తో తలపడనుండగా.. నోవాక్ జకోవిచ్, షెల్టన్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
మాడిసన్ సంచలన విజయం..:మహిళల సింగిల్స్లో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) సెమీస్కు దూసుకెళ్లింది. క్వార్టర్స్లో కీస్ 6-1, 6-4తో తొమ్మిదో సీడ్ మార్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చింది. ఈ ఏడాది వింబుల్డన్ గెలిచి జోరు మీదున్న వొండ్రుసోవాకు మాడిసన్ కళ్లెం వేసింది. ఈ మ్యాచ్లో ఆమె 4 ఏస్లు, 19 విన్నర్లు కొట్టింది.