న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీకి నిరసన సెగ తగిలింది. అమెరికా టీనేజ్ సెన్సేషన్ కోకో గాఫ్, చెక్ ప్లేయర్ కరోలినా ముచోవా మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్కు ఆందోళన కారులు అంతరాయం కలిగించారు.
పర్యావరణాన్ని రక్షించాలంటూ ముగ్గురు వ్యక్తులు ఆందోళన చేపట్టడంతో మ్యాచ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇందనాలను రక్షించాలంటూ ఆందోళన కారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. తొలి గేమ్ రెండో సెట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ నిరసనలతో మ్యాచ్ ఆగిపోగా.. కోకో గాఫ్, ముచోవా ఓ 10 నిమిషాల పాటు కోర్టులోనే నిలబడిపోయారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన కారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఎంతకు వినలేదు. పర్యావరణాన్ని రక్షించాలని, ఇంధనాలను కాపాడాలని గట్టిగా అరిచారు.
వారి నిరసనలతో ఈ మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులు సహనం కోల్పోయారు. వెంటనే వారిని మైదానం బయటకు లాగిపడేయాలని డిమాండ్ చేశారు. దాంతో వారిని బయటకు తరలించడం సెక్యూరిటీ శక్తికి మించిన పనిగా మారింది. మరోవైపు టెన్నిస్ ప్లేయర్లు ఈ అంతరాయం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
'వారితో చర్చలు జరుపుతున్నారా? లేక బయటకి పంపిస్తున్నారా?'అని కోకో గాఫ్ చైర్ అంపైర్, టోర్నీ రిఫరీని ప్రశ్నించింది. చివరకు అసహనంగానే మైదానం వీడింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కోకో గాఫ్ 6-4, 1-0తో ఆధిక్యంలో నిలిచింది.