
న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2020 టోర్నీలో భారత టెన్నిస్ యువ కెరటం సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. భారత కాలమాన ప్రకారం గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ సెకండ్ రౌండ్లో 124 ర్యాంకర్ అయిన సుమిత్ 3-6, 3-6, 2-6తో ఆస్ట్రియా స్టార్, రెండో సీడ్ డొమినిక్ థీమ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. గంటా 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బర్త్డే బాయ్ డొమినిక్ ధాటికి సుమిత్ వరుసగా మూడు సెట్లలో ఖంగుతిన్నాడు. తొలి సెట్ అయిదవ గేమ్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా చెలరేగారు. అప్పుడప్పుడు మెరుపు లాంటి షాట్లతో నాగల్ దడ పుట్టించినా.. టాప్ ప్లేయర్ ముందు తలవంచక తప్పలేదు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్లో ఫైనల్కు వెళ్లిన డామినిక్ థీమ్.. ఈ మ్యాచ్కు ముందు సుమిత్ నగాల్ ఆట తీరు గురించి వీడియోలను పరిశీలించినట్లు చెప్పాడు. సుమిత్ నగాల్ ఫోర్హ్యాండ్ షాట్లు బాగా ఆడుతాడని థీమ్ మెచ్చుకున్నాడు. 'మా ఆటకు పరిస్థితులు చక్కగా సరిపోయాయి. లాంగ్ ర్యాలీలు, ఫోర్ హ్యాండ్ షాట్లతో గేమ్ బాగా సాగింది'అని విజయానంతరం థీమ్ అన్నాడు.
ఇక ఈ టోర్నీ తొలి రౌండ్లో విజయం సాధించి.. గత ఏడేళ్లలో గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్డ్రాలో నెగ్గిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. గత మంగళవారం జరిగిన గేమ్లో నాగల్ 6-1, 6-3, 3-6, 6-1తేడాతో లోకల్ ప్లేయర్ బ్రాడ్లీ క్లాన్ను ఓడించాడు. చివరగా గ్రాండ్స్లామ్ మెయిన్డ్రాలో నెగ్గిన భారత ప్లేయర్గా సోమ్దేవ్ దేవ్ వర్మన్(2013 యూఎస్ ఓపెన్) ఉండగా.. తాజాగా నాగల్ ఆ ఫీట్ను రిపీట్ చేశాడు. కానీ ఆ ఉత్సహాన్ని కొనసాగించలేకపోయాడు.
మాజీ చాంపియన్ బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేకు షాక్ తగిలింది. గురువారమే జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ముర్రేపై 2-6, 3-6, 4-6తో కెనడాకు చెందిన 15వ సీడ్ ఫెలిక్స్ అగర్ అలియాస్సిమ్ గెలుపొందాడు. అసలు ముర్రేకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఆగర్ హ్యాట్రిక్ సెట్లను గెలుచుకుని మూడో రౌండ్లోకి ప్రవేశించాడు.