లండన్: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడాటోర్నీలన్నీ రద్దయ్యాయి. ఏటీపీ, డబ్ల్యూటీఏ టూర్లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో ఆటగాళ్లకు ఏమీ పాలుపోవడం లేదు. అయితే, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు లేకుండానే టోర్నీలు నిర్వహించాలంటూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ సూచించాడు. కరోనా అంతకంతకు వ్యాప్తి చెందుతున్న క్రమంలో టెన్నిస్ పునరుద్ధరణకు ఫ్యాన్స్ లేకుండా అయితే బాగుంటుందన్నాడు. ఈ విషయమై సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్తో సుదీర్ఘంగా చర్చినట్లు కూడా నాదల్ మీడియాకు తెలిపాడు.
అయితే ఈ స్పెయిన్ బుల్ ప్రతిపాదనను రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ వ్యతిరేకిస్తోంది. ఫ్యాన్స్ టెన్నిస్లో అంతర్భాగమని హలెప్ చెప్పింది. వారు లేకుండా టెన్నిస్ను ఊహించలేనంది.
'ఫ్యాన్స్ లేకుండా టెన్నిస్ కష్టం. అభిమానుల వల్లే పెద్ద పెద్ద టోర్నీల్లో మనం అద్భుతంగా ఆడుతున్నాం. వాళ్లు ఇస్తున్న మద్దతు వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. అందుకే అలాంటి అభిమానులు లేకపోతే టెన్నిస్ మరోలా ఉంటుంది. వ్యక్తిగత అంశానికి సంబంధించిన క్రీడ కాబట్టి, వారి ప్రభావం మనపై బాగా ఉంటుంది'అని హలెప్ అభిప్రాయపడింది. ఇక హలెప్తో క్విటోవా కూడా ఏకీభవించింది. కొవిడ్-19 కారణంగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఈ ఏడాది రద్దు కాగా, ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ధోనీ విజయ రహస్యం అదే : డుప్లెసిస్