
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 2020తో భారత్ తరఫున నాలుగు ఒలింపిక్స్ల్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్గా సానియా మీర్జా నిలవనుంది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సమ్మర్ గేమ్స్ కోసం సిద్దమవుతున్న ఈ భారత టెన్నిస్ స్టార్.. మైదానంలోనే కాకుండా బయట కూడా కష్టపడుతున్నానని చెప్పింది. కోర్టులో చురుకుగా కదిలేందుకు చాలా కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. అంకితా రైనాతో కలిసి సానియా.. టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతోంది.
'మన సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం అన్నింటికన్నా ముఖ్యం. నేను 30ల్లో.. ఈ స్థాయిలో ఉన్నా. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. ఇక, భారత్కు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి వేదికల్లో అది గౌరవంగా భావిస్తా. నాదో అద్భుతమైన కెరీర్. ప్రస్తుతం నేను 30ల్లో ఉన్నా.. కానీ నేను వయస్సు గురించి ఎప్పుడూ ఆలోచించను. ఆటపైనే దృష్టిపెడతా.. మెగా ఈవెంట్ కోసం కోర్టులో చాలా కష్టపడుతున్నా.
దాంతో పాటు మూమెంట్ పరంగా మరింత చురుకుగా ఉండేందుకు ఆఫ్ ద కోర్టు కూడా చాలా కసరత్తులు చేస్తున్నా. అంకితకు 15 ఏళ్లు ఉన్నప్పుడు తనని తొలిసారి కలిశా. క్రమశిక్షణ తన బలం. సహచర మహిళా ప్లేయర్తో కలిసి ఇప్పటిదాకా ఒలింపిక్స్లో నేను ఆడలేదు. ఈసారి చాన్స్ దొరికింది.'అని సానియా చెప్పింది.
2018లో ఇజాన్కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి సెకండ్ ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్బోర్న్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో తొలి రౌండ్లోనే సానియా నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది.
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్లో సానియా-మ్యాటెక్ సాండ్స్ జోడీ 3-6, 4-6తో అమెరికా ద్వయం సబ్రినా శాంటామరియా-క్రిస్టీనా మెక్హాలె చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం నెల వ్యవధిలో జరగనున్న వింబుల్డన్, ఒలింపిక్స్లపై దృష్టి సారించింది.