
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): మహిళల టెన్నిస్ డబుల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్, చెక్ రిపబ్లిక్ స్టార్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవా కెరీర్కు గుడ్బై చెప్పింది. 35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సువె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్కు చేరుకుంది. 'నా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నాను. ప్రసవం జరిగాక పునరాగమనం చేస్తానని చెప్పడంలేదు. అయితే చివరిసారి అభిమానులతో మ్యాచ్ ఆడాలని ఉంది' అని ఈ వరల్డ్ నెంబర్-2 చెప్పుకొచ్చింది.
2016 రియో ఒలింపిక్స్లో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాతో కలిసి స్ట్రికోవా మహిళల డబుల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. చివరిసారి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడిన స్ట్రికోవా సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ చేరుకోవడంతోపాటు రెండు టైటిల్స్ను గెలిచింది. డబుల్స్లో స్ట్రికోవా వరల్డ్ నంబర్వన్ ర్యాంక్లో నిలువడంతోపాటు 31 టైటిల్స్ను సొంతం చేసుకుంది. ఈ 31 టైటిల్స్లో రెండింటిలో (2016-సిన్సినాటి, టోక్యో ఓపెన్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామిగా ఉంది.
ఇక తన ఆటకు వీడ్కోలు పలికిన బార్బరా స్ట్రికోవాకు సానియా మీర్జా అభినందనలు తెలియజేసింది. స్ట్రికోవా సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించింది. 'స్టికోవా జీవితంలోని రెండో దశ బాగుండాలని కోరుకుంటున్నా. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎన్నో మధుర జ్ఞాపకలు ఉన్నాయి. ఆమె కుళ్లు జోకులు మేమంతా మిస్సవుతారం. స్టికోవా నీ అద్భుత కెరీర్కు అభినందనలు'అని సానియా రాసుకొచ్చింది.