
కేప్టౌన్: ఆఫ్రికా దేశాల్లోని చిన్నారుల విద్యా, క్రీడాభివృద్ధి కోసం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ 'మ్యాచ్ ఇన్ ఆఫ్రికా' పేరిట ఓ చారిటీ మ్యాచ్ నిర్వహించింది. ఫెడరర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మధ్య జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్కు అభిమానులు రికార్డు సంఖ్యలో హాజరయ్యారు. 2010 ఫుట్బాల్ ప్రపంచకప్ ఫైనల్ వేదికైన దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు ఏకంగా 51,954 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఓ టెన్నిస్ మ్యాచ్ను ఇంతమంది వీక్షించడం ఇదే తొలి సారి. ఈ మ్యాచ్లో ఫెడరర్ 6-4, 3-6, 6-3తో నాదల్ను ఓడించాడు.
ఈ మ్యాచ్ ద్వారా ఫెడరర్ ఫౌండేషన్ 35 లక్షల డాలర్లను (రూ. 25 కోట్లు) సేకరించడం విశేషం. దక్షిణాఫ్రికాకు చెందిన ఫెడరర్ తల్లి లినెట్టి కూడా ఈ మ్యాచ్ను వీక్షించారు. తన 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏనాడూ ఫెడరర్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ ఆడలేదు. గత నవంబర్లో మెక్సికోలో ఫెడరర్, జ్వెరెవ్ (జర్మనీ) మ్యాచ్కు 42,517 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజాగా ఫెడరర్-నాదల్ మ్యాచ్ 51,954 మందితో అధిగమించింది.
ఇక ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్లో స్విస్ స్టార్ ఫెడరర్కు చుక్కెదురైన విషయం తెలిసిందే. సెమీస్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్లో జొకోవిచ్ 7-6(7/1), 6-4, 6-3 తేడాతో ఫెదరర్పై గెలిచాడు. ఈ విజయంతో ఫెదరర్-జొకోవిచ్ ముఖాముఖి రికార్డు 27-23గా మారింది.