
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యావత్ టెన్నిస్ లోకం షాక్కు గురైంది. వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఫ్రస్టేషన్లో మహిళా లైన్ జడ్జ్ను బంతితో కొట్టాడు. దీంతో ఈ టాప్ సీడ్ ఆటగాడిపై నిర్వహాకులు అనర్హత వేటు వేసారు. తద్వార వరుస విజయాలతో దూకుడు మీదున్న నోవాక్ జకోవిచ్ కథ నాలుగో రౌండ్లోనే ముగిసింది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆదివారం జకోవిచ్ స్పెయిన్కు చెందిన పాబ్లో కారెనో బస్టాతో తలపడ్డాడు. ఈ గేమ్లో ఓపెనింగ్ సెట్ కోల్పోయిన సెర్బియా స్టార్.. 5-6తో వెనుకబడి సర్వీస్ను చేజార్చుకున్నాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఈ వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు వెనక్కు తిరిగి బంతిని బలంగా కొట్టాడు. అయితే అక్కడే లైన్ జడ్జ్ ఉండటంతో ఆమెకు బంతి బలంగా తాకింది. వెంటనే తన తప్పును తెలుసుకున్న జకోవిచ్.. ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జకోవిచ్ వాదించినప్పటికీ.. నిబంధనల ప్రకారం టోర్నీ నిర్వాహకులు అతన్ని డిస్ క్వాలిఫై చేశారు. ఇక జకోవిచ్పై వేటు వేయడం సరైందేనని టెన్నిస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 1995లో ఇలాంటి చర్యకే పాల్పడ్డ టిమ్ హెమ్మన్పై కూడా అనర్హత వేటు వేసారని గుర్తు చేశాయి. జకో ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అతని చర్యలకు బాధ్యత వహించాల్సిందేనన్నాయి. నడాల్, ఫెడరర్ లేని ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఈ సెర్బియా స్టార్.. నాలుగోసారి ఇక్కడ విజేతగా నిలవాలన్న లక్ష్యం నెరవేరకుండానే ఇంటిదారి పట్టాడు.