
న్యూయార్క్: అనుకున్న సమయానికే యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ను నిర్వహించేందుకు యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్టీఏ) రెడీ అయింది. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే న్యూయార్క్ వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు పోటీలను నిర్వహించాలని యూఎస్టీఏ నిర్ణయించింది. ఈ మేరకు యూఎస్టీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ డౌజ్ అధికారికంగా ప్రకటించారు. టోర్నీ నిర్వహణకు న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి మంజూరు చేసింది.
కోవిడ్-19 కారణంగా టోర్నీని నిర్వహించేందుకు సంబంధించిన నిబంధనల ప్రతీ ప్రక్రియను అనుసరిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. 'యూఎస్ ఓపెన్ నిర్వహణకు కావాల్సిన అనుమతి లభించింది. అందరి ఆరోగ్య భద్రత, ఈ పరిస్థితుల్లో సన్నాహకాలు, ఆర్థిక సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాం. ఇప్పుడు ప్రభుత్వ అనుమతి రావడంతో టోర్నీలో ఎవరెవరూ పాల్గొంటారనేది అసలు సమస్యగా మారింది' అని క్రిస్ వివరించారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారులు జొకోవిచ్, బార్టీ, డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ టోర్నీలో పాల్గొనడంపై నిరాసక్తంగా ఉన్నారు.
ఈ టోర్నీ మ్యాచ్లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గ్రాండ్స్లామ్ల్లో నాలుగో, చివరిదిగా యూఎస్ ఓపెన్ను నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత జరగనున్న రెండో మెగా గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్ కానుంది. ఫ్రెంచ్ ఓపెన్ను వాయిదా వేయగా.. వింబుల్డన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. యూఎస్ ఓపెన్ ముగిసిన వారం రోజుల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ను నిర్వహించే అవకాశం ఉంది.