
న్యూయార్క్: జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఓసాకా గాయం కారణంగా సిన్సినాటి మాస్టర్స్ వెస్టర్న్ అండ్ సదరన్ టోర్నీ ఫైనల్ నుంచి వైదొలిగింది. దాంతో, మహిళల సింగిల్స్ తుదిపోరులో వాకోవర్తో విక్టోరియా అజరెంకా టైటిల్ నెగ్గింది. ఎడమకాలు కండరం గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన ఒసాకా అభిమానులకు క్షమాపణలు చెప్పింది.
సెమీస్ మ్యాచ్ సెకండ్ సెట్లో కండరాలు పట్టేశాయని తెలిపింది. ఫైనల్ టైమ్ వరకు నొప్పి తగ్గుతుందని ఆశించినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఈ వారం తనకు చాలా భావోద్వేగంగా గడిచిందని, మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యావాదాలని పేర్కొంది.
అంతకుముందు అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో పట్టపగలే నల్లజాతి వ్యక్తి జాకబ్ బ్లేక్పై పోలీసుల కాల్పుల ఘటనకు నిరసనగా సెమీఫైనల్కు చేరిన ఒసాక విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అథ్లెట్ కన్నా ముందు నల్లజాతి మహిళగా అన్యాయంపై పోరు కోసమే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ఒసాకా ట్విటర్లో పేర్కొంది.
'నేను ఈ మ్యాచ్ ఆడనంత మాత్రాన ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ శ్వేత జాతీయుల ఆధిపత్యం ఉండే టెన్నిస్లో నా గళాన్ని వినిపిస్తే కాస్తయినా ఈ అంశంపై కదలిక వస్తుందని భావిస్తున్నా' అని ఆమె ట్వీట్ చేసింది.
అంతలోనే తన నిర్ణయం మార్చుకొని శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగింది. 6-2, 7-6 (7/5) స్కోరుతో ఎలీజ్ మెర్ టెన్స్ (బెల్జియం)పై గెలిచి ఫైనల్ చేరింది. సొంతంగా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటావని ఆమె స్పాన్సర్ సంస్థ 'నైకీ' ఒత్తిడి చేయడంతో ఒసాక మళ్ళీ బరిలోకి దిగినట్లు తెలిసింది.
ఇక 2018 యూఎస్ ఓపెన్, 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల చాంపియన్ అయిన ఒసాక.. సోమవారం ప్రారంభంకానున్న యూఎస్ ఓపెన్ 2020లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆమె గాయం నుంచి కోలుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే కరోనా పుణ్యమా స్టార్ ఆటగాళ్లంతా ఈ మెగాటోర్నీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.