టోక్యో: జపాన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ నవోమి ఒసాకా మరో టోర్నీకి దూరం కానుంది. మీడియా సమావేశాల బహిష్కరణ, రిఫరీ జరిమానా వంటి వరుస వివాదాలతో ఫ్రెంచ్ ఓపెన్ 2021 నుంచి అర్దంతరంగా తప్పుకున్న ఒసాకా.. వచ్చేవారం ప్రారంభం కానున్న బెర్లిన్ డబ్ల్యూటీఏ గ్రాస్ కోర్ట్ టోర్నీకి కూడా దూరంగా ఉండనున్నట్లు నిర్వాహకులకు సమాచారమిచ్చింది.
ఈ విషయాన్ని బెర్లిన్ టోర్నీ ఆర్గనైజర్స్ ధృవీకరించారు. 'బెర్లిన్ టోర్నీలో పాల్గొనడం లేదని నవోమి ఒసాక మాకు సమాచారమిచ్చింది. విరామం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె మెనేజ్మెంట్ పేర్కొంది'అని బెర్లిన్ టోర్నీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం బెర్లిన్ టోర్నీ జూన్ 14న ప్రారంభం కానుంది.
ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్ విజయానంతరం మీడియా సమావేశానికి హాజరుకాకుండా వెళ్లిన ఒసాకాకు రిఫరీ 15,000 డాలర్ల జరిమానా విధించారు. అంతేకాకుండా ఇలాంటి ప్రవర్తననే పునరావృతం చేస్తే టోర్నీ నుంచి బహిష్కరిస్తామని గ్రాండ్స్లామ్స్ నిర్వాహకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన ఒసాకా టోర్నీ నుంచి వైదొలిగింది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. 2018 యూఎస్ ఓపెన్ నుంచి తాను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు, అందుకే తప్పుకొంటున్నట్లు ట్వీట్ చేసింది. ఇక భవిష్యత్తు ప్రణాళికలేంటో ఈ జపాన్ స్టార్ చెప్పలేదు. దాంతో జూన్ 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ ఆ తర్వాత జరిగే టోక్యో ఒలింపిక్స్లో ఆమె పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.