
మాడ్రిడ్: కరోనా లాక్డౌన్ వల్ల స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అసహనానికి గురవుతుంటే.. స్విస్ లెజెండ్ రోజర్ ఫెడరర్ మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నాడు. టెన్నిస్ లేకుండా ఈ ఇద్దరు ఇంటి పట్టునే ఉంటున్నా.. నాదల్ మాత్రం ఈ బ్రేక్ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
టెన్నిస్ ప్రాక్టీస్ లేదని ఈ స్పెయిన్ స్టార్ ఫ్రస్టేషన్కు గురవుతున్నాడు.
ఫెడరర్ మాత్రం తన మోకాలికి జరిగిన శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి తగిన సమయం దొరికిందంటున్నాడు. కరోనా విలయం నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న స్పెయిన్లో ఇప్పుడిప్పుడే కొన్నింటికి సడలింపులు ఇస్తున్నారు. అయితే, టెన్నిస్ సాధనకు మాత్రం అనుమతి లేదు. 'టెన్నిస్ ప్రాక్టీస్లో చాలా భౌతిక దూరం పాటిస్తాం. ఒకరు ఒకవైపు ఆడితే.. మరొకరు మరోవైపు ఉంటారు. మరి ఎందుకు సడలింపు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు' అని ఇన్స్టా లైవ్లో రాఫెల్ చెప్పాడు. ఈ సందర్భంగా లాక్డౌన్ అనుభవాల గురించి ఫెడెక్స్, ఆండీ మర్రేతోనూ మాట్లాడాడు. కాగా, మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న ఫెడరర్ ఇంట్లోనే పునరావాస చికిత్స తీసుకుంటున్నాడు. ఎటువంటి ఒత్తిడీ లేకుండా హాయిగా ఉన్నానని ఫెడెక్స్ చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనలు పాటించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.
కరోనా మహమ్మారి దెబ్బకు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. టెన్నిస్ కూడా నిలిచిపోయింది. మళ్లీ టోర్నీలు ఎప్పుడు ప్రారంభమవుతాయో అనేదానిపై స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లు, ముఖ్యంగా లోయేస్ట్ ర్యాంక్ ప్లేయర్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్ దిగ్గజ త్రయం రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్ టెన్నిస్ తారల కోసం నిధిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం టాప్-100 సింగిల్స్, టాప్-20 డబుల్స్ ప్లేయర్లకు వాళ్ల ర్యాంకులను బట్టి కొంత డబ్బును డొనేట్ చేయాలని సూచించారు. వీళ్ల విరాళాలతో పాటు ఏటీపీ, గ్రాండ్ స్లామ్ నిర్వహాకుల నుంచి కొంత మొత్తాన్ని సేకరించనున్నారు. ఇది మొత్తం రూ.34 కోట్ల 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని కింది స్థాయి ప్లేయర్లకు పంచనున్నారు.