
దుబాయ్: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి చేతులు కలిపిన భారత్-పాకిస్థాన్ టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న- ఐసాముల్ హక్ ఖురేషీలకు ఫస్ట్ మ్యాచ్లోనే చుక్కెదురైంది. మెక్సికన్ ఓపెన్ ఏటీపీ 500 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఈ అన్సీడేడ్ ఇండో-పాక్ ధ్వయం 6-7, 6-2, 10-1 తేడాతో రెండో సీడ్ బ్రూనో సోరెస్-జేమీ ముర్రే(బ్రెజిల్-స్కాటిష్) జోడీ చేతిలో పోరాడి ఓడింది.
తొలి సెట్ను టై బ్రేకర్లో గెలిచి మంచి ఊపు మీద కనిపించిన ఇండో-పాక్ జోడీ.. తర్వాతి రెండు సెట్లలో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. చివరిసారి బోపన్న, ఖురేషీ 2014లో షెంజెన్లో జరిగిన ఏటీపీ టోర్నీలో ఆడారు. అయితే ఇప్పుడు కూడా కేవలం ఇదొక్క టోర్నీ కోసమే తాము చేతులు కలిపినట్లు వీళ్లు ముందే స్పష్టం చేశారు. తమ ర్యాంకు తక్కువగా ఉండటంతో పెద్ద టోర్నీల్లో ఆడే అవకాశం తమకు లేదన్నారు.
టెన్నిస్లో ఇండో-పాక్ ఎక్స్ప్రెస్గా ఈ జోడీ ఖ్యాతి గడించింది. గతంలో ఐదు టైటిళ్లను సాధించిన ఈ ఇండో-పాక్ ద్వయం.. 2010 వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్కు చేరింది. అదే ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది.
ఇక 2011 పారిస్ మాస్టర్స్ టోర్నీ నెగ్గడంతో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఈ ఇండో పాక్ ద్వయం టాప్-10లోకి చేరుకుంది. డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం బోపన్న 40వ స్థానంలో, ఖురేషీ 49వ ర్యాంకులో కొనసాగుతున్నారు.